ముంబై: రెండున్నరేళ్లుగా దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. గత ఏడాది సుమారు నాలుగునెలలకుపైగా పూర్తి స్థాయిలో దేశం లాక్డౌన్లోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో లాక్డౌన్ అమలు కావడం వల్ల అనేక రంగాలు కుదేల్ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించే రంగాల్లో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రవాణా, పరిశ్రమలు, హాస్పిటాలిటీ సెక్టార్, పర్యాటకం.. ఇవన్నీ స్తంభించిపోయాయి.
ఈ ఏడాది కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు మళ్లీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. ఏపీ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు మినహా దేశం మొత్తం మళ్లీ లాక్డౌన్ తరహా వాతావరణాన్ని చవి చూసింది. ఇలాంటి సంక్షోభ కాలంలోనూ దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం వెల్లువలా వచ్చి పడ్డాయి. ఏప్రిల్ 1వ తేదీన ఆరంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనూహ్యం పెరిగాయి. 168 శాతం మేర పెరుగుదల నమోదు కావడం అంటే మాటలు కాదు.

గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంతో పోల్చుకుంటే ఈ ఏడాది దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతం 168 మేర పెరిగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల 6.56 బిలియన్ డాలర్లు మాత్రమే. ఏడాది తిరిగే సరికి ఈ సంఖ్య 17.57 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఏప్రిల్-మే-జూన్ నెలల్లో వేర్వేరు రంగాల్లో 17,57 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డయినట్లు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత పెంచడానికి తీసుకొచ్చిన సంస్కరణలు, సరళీకరణ విధానాల వల్లే ఇది సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించిన సెక్టార్లలో ఆటోమొబైల్ అగ్రస్థానంలో ఉంది.
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 27 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈక్విటీ నమోదైంది. ఈ విషయంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సెక్టార్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రంగంలో 17 శాతం మేర విదేశీ పెట్టుబడులు నమోదయ్యాయి. సర్వీస్ సెక్టార్లో 11 శాతం మేర ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. కాగా- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా 88 శాతం ఎఫ్డీఐ ఈక్విటీ ఇన్ఫ్లో కర్ణాటకలో నమోదైనవే. మహారాష్ట్ర 23 శాతం, ఢిల్లీ 11 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీని ఆకర్షించాయి.


Click it and Unblock the Notifications