నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆదివారం (డిసెంబర్ ) నుంచి FASTag విధానం అమలులోకి వస్తోందని జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు శనివారం వెల్లడించారు. దీనిని తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికే అందరిలో అవగాహన రాకపోవడంతో వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన మోడీ ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, మరో ఊరట కల్పించింది కేంద్రం.
చదవండి: కారులో వెళ్తున్నారా.. మీ కోసమే, FASTag తప్పనిసరి: ఏమిటిది.. ఎలా?
25 శాతం టోల్ లైన్లలో నగదు చెల్లించవచ్చు
FASTagను అమలు చేస్తూనే మోడీ ప్రభుత్వం వాహనదారులకు ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టోల్ ప్లాజాల వద్ద 25 శాతం FASTag లైన్లను తాత్కాలికంగా హైబ్రిడ్ లైన్లుగా మార్చారు. ఈ లైన్లలో అటు FASTagతో పాటు ఇటు నగదు చెల్లింపును కూడా అనుమతిస్తారు. అంటే 75 శాతం FASTag, మిగతా 25 శాతం FASTagతో పాటు నగదును కూడా చెల్లించే వెసులుబాటు కల్పించింది.
నెల రోజులు మాత్రమే
FASTagతో పాటు నగదు చెల్లింపు వెసులుబాటు సౌకర్యాన్ని 15 జనవరి 2020 వరకు కల్పిస్తున్నారు. NHAI నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. అయితే నెల రోజులు తర్వాత ఈ లైన్లను కూడా FASTag లైన్లుగా మార్చాతారు.
ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు
FASTagకు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కు ఫోన్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, శనివారం నాటికి NHAI, ఇతర ఏజెన్సీలు దేశవ్యాప్తంగా 96 లక్షల FASTagలను విక్రయించాయి.
FASTag మార్గంలోనే వెళ్తే అధిక ఛార్జీ
దేశంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత FASTag దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. FASTag లేని వారు ఎంత త్వరగా కొనుగోలు చేస్తే అంత మంచిదని చెబుతున్నారు. FASTag వల్ల సమయం ఆదా, ఇంధనం ఆదా, టోల్ ప్లాజాల వద్ద క్రమంగా రద్దీ తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కాగా, నగదు చెల్లించి వెళ్లే మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటే FASTag దారిలో వెళ్లాలనుకునే వారు అదనంగా మరింత ఎక్కువ రుసుము చెల్లించి వెళ్లవచ్చునని NHAI అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని, మార్షల్స్ను నియమించారు. ఇక, ఉచితంగా వెళ్లే ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీఐపీల వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులు సూచించారు.