అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్
న్యూఢిల్లీ: నేటి అర్ధరాత్రి (ఫిబ్రవరి 15 అర్ధరాత్రి) నుండి FASTag తప్పనిసరి. FASTag లేకుంటే మాత్రం డబుల్ టోల్ ఫీజు వసూలు చేస్తారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ ఆదివారం ప్రకటించింది. టోల్ ప్లాజా వద్ద రద్దీని, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంతో డిజిటల్ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? వడ్డీ, ఇతర ఆదాయాలపై టీడీఎస్ భారం
ఇక వాయిదా లేదు
FASTag అమలును వాయిదా వేసేది లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్నారన్నారు. రీచార్జ్ కార్డులాగా ఉపయోగించే ఈ FASTags సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు, పలు రిటైల్ సంస్థలు విక్రయిస్తున్నాయి. HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, పేటీఎం పేమెంట్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు ఇలా ఎన్నో దీనిని జారీ చేస్తున్నాయి. 27 బ్యాంకులతో ఫాస్టాగ్ జారీకి భాగస్వామ్యం కుదిరింది. దేశవ్యాప్తంగా 30వేల కేంద్రాల్లో ఫాస్టాగ్ అమ్మకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా లభించేలా ఏర్పాట్లు చేశారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. భారత్ పే పేమెంట్స్ సిస్టం, యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు, మై ఫాస్టాగ్ మొబైల్ యాప్, పేటీఎం, గూగుల్ పే తదితర పోర్టల్స్ ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. టోల్ప్లాజాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద రీఛార్జ్ సౌకర్యం ఉంది.
2016 నుండి అమల్లోకి...
భారత్ మొత్తంలోని 720 టోల్ ప్లాజా వద్ద కూడా FASTag పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి బైక్స్ లేదా ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ 2016లో అమల్లోకి వచ్చింది. అయితే ఫాస్టాగ్తో పాటు నగదు చెల్లింపులకు అవకాశం కల్పించింది కేంద్రం. 2017 డిసెంబర్ నుండి కొత్తగా రోడ్డెక్కే ప్రతి వాహనానికి తప్పనిసరి చేసింది. ఈ మేరకు మోటార్ వెహికిల్ నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది. అంతకుముందు వాహనాలకు కూడా ఈ ఏడాది జనవరి 1 నుండి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 15కు పొడిగించింది.
డబుల్ టోల్
కేటగిరీ M, N ఉంటాయి. కేటగిరీ M అంటే పాసింజర్స్ను తీసుకు వెళ్లే కనీస ఫోర్ వీలర్స్. కేటగిరీ N అంటే గూడ్స్ తీసుకు వెళ్లే కనీస ఫోర్ వీలర్స్. ఇవి పర్సన్స్తో పాటు ఉత్పత్తులు తీసుకు వెళ్తాయి. నేటి అర్ధరాత్రి నుండి FASTag లేకుంటే డబుల్ టోల్ వసూలు చేస్తారు.