కరోనా వైరస్ కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా చితికిపోయారు. మన దేశంలో చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఆయా రంగాల దిగ్గజ కంపెనీలు, తమతమ రంగాల్లోని వ్యాపారులకు కాస్త అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చింది.
భారత్లోని స్మాల్, మీడియం సైజ్ బిజినెస్ కోసం సెక్యూర్ లోన్స్ ఇచ్చే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించింది. తమ ఈ కొత్త ప్రోగ్రాం పేరును స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్గా పేర్కొంది. లోన్స్ కోసం ఇబ్బంది పడుతున్న చిన్న వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజనమని తెలిపింది. ఫేస్బుక్ గత ఏడాది స్మాల్ బిజినెస్ లోన్ కోసం 4.3 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇప్పుడు వ్యాపారాలకు రూ.5,00,000 నుండి రూ.50,00,000 రుణాలు అందించేందుకు ముందుకు వచ్చింది. వీటిని ఏడాదికి 17 శాతం నుండి 20 శాతం వడ్డీ రేటుకు అందిస్తుంది. మహిళలకు 0.2 శాతం రుణ రాయితీ ఇవ్వనున్నారు.

తమ ప్లాట్ఫాం పైన వాణిజ్య ప్రకటనలు ఇచ్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే ఈ ప్రోగ్రాం కోసం ఫేస్బుక్... ఇండిఫీ అనే రుణసంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్థలతో చేతులు కలుపుతామని తెలిపింది. ఈ తరహా కార్యక్రమాన్ని భారత్లోనే తొలిసారి ప్రారంభించడం గమనార్హం. భారత్లో మొత్తం 200 పట్టణాల్లో రిజిస్టర్ అయిన కంపెనీలకు ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు ఫేస్బుక్ ఇండియా ఎండీ, ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్ తెలిపారు.


Click it and Unblock the Notifications