గుడ్ న్యూస్: ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో 23,000 ఉద్యోగాలు
భారత దేశంలో ఎటు చూసినా ఆర్థిక మందగమన ఛాయలు నెలకొన్న సమయంలో ఆడిటింగ్ దిగ్గజం ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. బిగ్ ఫోర్ గా పరిగణించే మొత్తం నాలుగు ఆడిటింగ్ సంస్థల్లో ఇది ఒక్కటి మాత్రమే అధిక మొత్తంలో ఉద్యోగులను నియమిస్తుండటం విశేషం. పీడబ్ల్యూసి, డెలాయిట్ సహా ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలకు ఇటీవల మన దేశంలో ఎదురు దెబ్బ తగిలింది.
కొన్ని కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు ఈ కంపెనీలు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ మాత్రం ఇలా ఇండియా లో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతుండటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకూ ఈ కంపెనీ నియమిస్తోన్న ఉద్యోగుల సంఖ్యా ఎంతో తెలుసా.... 23,000 మంది. అది కూడా ఒక్క ఏడాదిలోనే. ఒక ఐటీ కంపెనీ స్థాయిలో నియమాలకు సిద్ధమవుతున్న కంపెనీ ప్రణాళికల గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది ఎకనామిక్ టైమ్స్ లో ఈ మేరకు ఒక కథనం ప్రచురితం అయింది. అందులోని ముఖ్యాంశాలు మీ కోసం.
ఆటో స్పేర్స్లో లక్ష ఉద్యోగాలు కట్, 10% కంటే ఎక్కువగా పడిపోయిన టర్నోవర్
అమెరికా తర్వాత ఇండియానే...
ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీకి భారత్ లో ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. గ్లోబల్ డెలివరీ సెంటర్ల ద్వారా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ కు సుమారు 50,000 ఉద్యోగులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 23,000 మందిని కొత్తగా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 11,000 మందికి కొలువులు ఇవ్వగా ... ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 12,000 మందిని నియమించుకోనుంది. దీంతో అమెరికా వెలుపల ఎర్నెస్ట్ అండ్ యంగ్ కు భారత్ లో అత్యధిక ఉద్యోగులు ఉన్నట్లు అవుతుంది. ప్రపంచంలోని మా వినియోగదారులకు సేవలు అందించేందుకు ఇండియా ఒక అద్బుతమైన ప్రదేశం. టెక్నాలజీ పరంగా చూసినా, విధానాల పరంగా చూసినా, మానవ వనరుల నైపుణ్యం పరంగా చూసినా ... ఇండియా గొప్ప ప్రదేశం అని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఉన్నతాధికారి జూలీ లిన్ టీగ్లాన్డ్ పేర్కొన్నారు.
స్టెమ్ లో ఎక్కువ ఉద్యోగాలు...
భారత్ లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథెమాటిక్స్ ) టాలెంట్ చాలా అధికం. ఆ టాలెంట్ ను తాము మెరుగ్గా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు జూలీ వెల్లడించారు. అందుకే ఇండియాలో నియమించుకొనే ఉద్యోగుల్లో సుమారు 50% స్టెమ్ కే సంబంధించిన వారు ఉంటారు. ఇండియాలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆదాయం కూడా మెరుగ్గా ఉండటం తో ఈ కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం ఇక్కడ 19.1% పెరగటం విశేషం. అందుకే గ్లోబల్ కంపెనీలు అన్నీ కొలువుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నా... ఎర్నెస్ట్ అండ్ యంగ్ మాత్రం దూసుకుపోతోంది.
ఆర్బీఐ నిషేధం...
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్ కుంభకోణం నేపథ్యంలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ అనుబంధ సంస్థ ఐ ఎస్ ఆర్ బట్లిబోయి అండ్ కో ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధించింది. ఇండియా లోని వాణిజ్య బ్యాంకుల ఆడిటింగ్ చేయకూడని ఆ సంస్థను ఆదేశించింది. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజి కి సంబంధించి కూడా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పై విచారణ జరుగుతోంది. ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్ అనుబంధ సంస్థలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఈ విచారణ ఎదుర్కొంటోంది. అయితే, దీని ప్రభావం భారత్ లో పెట్టుబడులు, ఉద్యోగ నియామకాలపై ఏమాత్రం ఉండబోదని జూలీ వెల్లడించారు. దేశంలో తమకు మెరుగైన మార్కెట్ షేర్ ఉందని, దానిని కాపాడుకోగలమని విశ్వాసం వ్యక్తం చేసారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు ఐన టాప్ 300 కంపెనీల్లో కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది.
అందుకే వీటికి డిమాండ్...
దేశంలోని స్టాక్ మార్కెట్ల లో నమోదు ఐన లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా ప్రపంచ స్థాయి ఆడింగ్ సంస్థలతో ప్రతి ఏటా ఆడింగ్ చేయించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే డెలాయిట్, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీల్లో ఎదో ఒక సంస్థతో కంపెనీలు ఆడిటింగ్ చేయిస్తాయి. కానీ సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో పీడబ్ల్యూసీ ని నిషేధించారు. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో వీటన్నిటిపైనా ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా మార్గనిర్దేశకలా ప్రకారం గ్లోబల్ ఆడిటింగ్ సంస్థలు కావటంతో వీటితో పనిచేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయి.