ఏప్రిల్లో 30 శాతం పెరిగిన ఎగుమతులు, వాణిజ్య లోటు 20.11 బిలియన్ డాలర్లు
భారత వాణిజ్య ఎగుమతులు ఏప్రిల్ నెలలో 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాల రంగాలు మంచి ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే దిగుమతులు కూడా 30.97 శాతం పెరిగి 60.3 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దీంతో వాణిజ్య లోటు 20.11 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021 ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు 15.29 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
పెట్రోలియం, ముడి చమురు దిగుమతులు 87 శాతానికి పైగా పెరిగి 20.2 బిలియన్ డాలర్లకు చేరుకోగా, బొగ్గు, కోక్ దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం దిగుమతులు 72 శాతం క్షీణించి 1.72 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021 ఏప్రిల్ నెలలో పసిడి దిగుమతులు 6.23 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 15.38 శాతం పెరిగి 9.2 బిలియన్ డాలర్లకు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 113.21 శాతం పెరిగి 7.73 బిలియన్ డాలర్లకు చేరాయి.
2022 ఏప్రిల్ నెలలో సర్వీస్ ఎగుమతులు 27.60 బిలియన్ డాలర్లుగా నమోదు కావొచ్చునని వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2021 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 52.87 శాతం ఎక్కువ అని తెలిపింది. సేవల దిగుమతులు కూడా 61.87 శాతం పెరిగి 15.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.