GST నుండి కరోనా వ్యాక్సీన్ను మినహాయిస్తే ప్రజలపై భారం: మమతా బెనర్జీకి నిర్మలమ్మ
కరోనా వ్యాక్సీన్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులపై, దేశీయ సరఫరాపై జీఎస్టీని మినహాయిస్తే అవి మరింత ఖరీదుగా మారుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముడి వస్తువులపై చెల్లించిన పన్నులను తయారీ సంస్థలు ఆఫ్సెట్ చేసుకునే అవకాశం కోల్పోవడమే ఇందుకు కారణం అవుతుందన్నారు. ప్రస్తుతం దేశీయంగా టీకా సరఫరా, వ్యాపారపరమైన దిగుమతులపై 5 శాతం, కరోనా ఔషదాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
కరోనా సెకండ్ వేవ్: బ్యాంకు డిపాజిట్ పరిమితి పెంచాలి, మరో ఉద్దీపన కావాలి
రాష్ట్రాలకు అధిక వాటా
ఒకవేళ జీఎస్టీ నుండి వీటిని మినహాయింపునిస్తే వ్యాక్సీన్ తయారీ సంస్థలు తాము కట్టిన పన్నులను ఆఫ్సెట్ చేసుకునే అవకాశం లేక ధరల పెంపు ద్వారా ఆ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశముందని, కాబట్టి జీఎస్టీ మినహాయింపు వల్ల కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు ప్రతికూల ఫలితాలు ఇస్తుందని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా నిర్మల పేర్కొన్నారు. ఉత్పత్తులపై విధించే సమీకృత జీఎస్టీ(IGST)లో రాష్ట్రాలకే 70 శాతానికి పైగా వాటా ఉంటుందన్నారు.
నిపుణుల మాట
జీఎస్టీ నుండి కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు మినహాయింపునిస్తే వాటి ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు కూడా భావిస్తున్నారు. జీఎస్టీ నుండి పూర్తి మినహాయింపునిస్తే, తయారీదార్లు ముడి పదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం, కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
వారి లేఖ
కరోనా వ్యాక్సీన్, ఔషధాలు, పరికరాలను జీఎస్టీ నుండి మినహాయించాలని మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూడా ఈ తరహా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు.