eMudhra IPO: తొలి రోజు ఇలా: గ్రే మార్కెట్ ఏం చెబుతోంది?
ముంబై: దేశంలోనే అతిపెద్ద లైసెన్స్డ్ సర్టిఫైడ్ అథారిటీ ఇ-ముద్ర లిమిటెడ్ జారీ చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ బుకింగ్స్ ఇవ్వాళ ఆరంభం అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 421.79 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే ఉద్దేశంతో జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. కంపెనీ మొత్తం రెండుగా డివైడ్ అయిన తరువాత ఐపీఓకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిజిటల్ ట్రస్ట్ సర్వీసెస్, ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్గా వేర్వేరుగా ఏర్పాటైంది.
తాజా ఈక్విటీలను జారీ చేయడం ద్వారా 161 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పుడున్న షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు 98,35,394 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా 251.79 కోట్ల రూపాయలను ఆర్జించగలిగింది ఇ-ముద్ర లిమిటెడ్ యాజమాన్యం. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 48,37,336 ఈక్విటీలను కేటాయించింది. వారి కోసం నిర్దేశించిన ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 256 రూపాయలు.
పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా మరో 412 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఐపీఓ బుకింగ్స్ ఈ ఉదయం ఆరంభం అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్.. రూ.243 నుంచి 256 రూపాయలుగా నిర్ధారించింది కంపెనీ యాజమాన్యం. ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 58 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తొలి గంటలో ఫర్వాలేదనిపించుకుంది. 19 శాతం మేర బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 38 శాతం మేర బుక్ అయింది. 21.8 లక్షల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి.. తొలి గంటలోనే.
నాన్ ఇన్స్టిట్యూటషన్ ఇన్వెస్టర్లు ఒక శాతం మేర అంటే 14,326 షేర్ల కోసం బిడ్డింగ్సే వేశారు. బిడ్డింగ్స్ దాఖలు చేయడానికి ఈ నెల 24.. చివరి తేదీ. 27వ తేదీన షేర్ల అలాట్మెంట్ ఉంటుంది. అలాట్ అయిన ఇన్వెస్టర్లకు షేర్లు వారి డీమ్యాట్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అలాట్మెంట్ దక్కని వారికి ఈ నెల 30వ తేదీన డబ్బులను వెనక్కి ఇస్తుంది కంపెనీ యాజమాన్యం 30, 31వ తేదీల్లో రీఫండ్ ప్రక్రియను పూర్తి చేస్తుంది.
జూన్ 1వ తేదీన ఈ కంపెనీ షేర్లు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అవుతాయి. ఈ ఐపీఓపై గ్రే మార్కెట్లో మంచి అంచనాలే ఉన్నాయి. తొలి రోజు గ్రే మార్కెట్ ప్రీమియం ఒక్కో షేర్ మీద 20 రూపాయలుగా ఉంది. అంటే- లిస్టింగ్ అయిన తరువాత 256 రూపాయలకు అదనంగా ఇంకో 20 రూపాయలు అధికంగా ఉండొచ్చనేది జీఎంపీ అంచనా.