ఉల్లి తర్వాత షాకిస్తోన్న వంట నూనె, ఏడాదిలో రూ.30 వరకు పెరుగుదల: ఏది ఎంత పెరిగిందంటే
ఎడిబుల్ ఆయిల్స్/వంట నూనె ధరలు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. వేరుశనగ (గ్రౌండ్నట్), ఆవాలు(మస్టర్డ్), వనస్పతి, సోయాబీన్, పొద్దు తిరుగుడు (సన్ఫ్లవర్) నూనెలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం నుండి 30 శాతం వరకు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేబినెట్ గ్రూప్లో గతవారం ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఆలు ధరలు కూడా ఎగిశాయి. అయితే కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు, పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం, నిల్వలను మార్కెట్లకు తరలించడం వంటి వివిధ చర్యలు చేపట్టడంతో ఉల్లి ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆలు ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఏడాదిలో 30 శాతం వరకు పెరిగిన నూనె ధరలు ఆందోళనను కలిగిస్తున్నాయి.
LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా
గత ఏడాది నుండి ధరల పెరుగుదల ఇలా
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రైస్ మానిటరింగ్ సెల్ డేటా ప్రకారం మస్టర్డ్ ఆయిల్ లీటర్ ధర గత ఏడాది ఇదే సమయంలో రూ.100 ఉండగా, ఇప్పుడు రూ.120కి పెరిగింది. వనస్పత నూనె ఏడాది క్రితం రూ.75.25 ఉండగా, ఇప్పుడు రూ.102కు పెరిగింది. సోయాబీన్ నూనె 2018 అక్టోబర్ 18వ తేదీన 90 ఉండగా, ఇప్పుడు రూ.110కి చేరుకుంది. సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ధరల్లోను దాదాపు 25 శాతం నుండి 30 శాతం పెరుగుదల కనిపించింది.
ధరలు పెరగడానికి కారణం...
గత ఆరు నెలలుగా మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి పడిపోవడం ఈ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. మన దేశంలో ప్రాసెస్ చేసిన దాదాపు 70 శాతం పామాయిల్ను ఆహార పరిశ్రమ ఉపయోగిస్తోంది. ఇది అతిపెద్ద వినియోగదారు. మన దేశంలో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ పైన దిగుమతి సుంకాన్ని తగ్గించడం ప్రభుత్వం చేతిలో ఉందని ఈ పరిశ్రమ కోరుతోంది. పామాయిల్ ధరల పెరుగుదల మొత్తం ఎడిబుల్ ఆయిల్స్ పైన పడ్డాయని చెబుతున్నారు.
దిగుమతి సుంకం తగ్గిస్తే..
కొద్ది నెలల క్రితం కిలో రూ.20 అంతకంటే తక్కువగా ఉన్న ఉల్లి ధరలు భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.100కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం పలు చర్యలు చేపట్టింది. దీంతో ధరలు కాస్త దిగి వచ్చాయి. ఇప్పుడు వంట నూనె ధరలు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం పామాయిల్ ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దిగుమతి సుంకాన్ని యోచన చేస్తోంది.