ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది, 5లక్షల కోట్ల డాలర్లు.. హఠాత్ నిర్ణయంకాదు: మోడీ
మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని, ప్రస్తుత మందగమనం నుంచి పటిష్టంగా పుంజుకునే సామర్థ్యం, సత్తా మనకు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే నెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన వారితో, మేధావులతో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో సూచనలు, సలహాలు కోరుతున్నారు. గురువారం ఆర్థికవేత్తలు, ప్రయివేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, బిజినెస్మెన్, వ్యవసాయ నిపుణులతో నీతి అయోగ్ కార్యాలయంలో మోడీ భేటీ అయ్యారు.
భారీగా తగ్గిన బంగారం ధర, రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే?
5 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు అందరం పని చేయాలి
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసి 5 ట్రిలియన్ డాలర్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేర్చాలన్న దిశగా అన్ని వర్గాలు పని చేయాలని సూచించారు. మనమంతా కలిసి పని చేయాలని, అందరం ఓ దేశమన్న భావన కలిగి ఉండాలన్నారు. రెండు గంటలకు పైగా సాగిన చర్చలో నిపుణులు చేసిన సూచనలను తప్పకుండా అమలు చేస్తామని ఆర్థికవేత్తలకు హామీ ఇచ్చారు.
ఉద్యోగాలు సృష్టించే సత్తా ఉంది
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యం హఠాత్తుగా పుట్టుకు రాలేదని, దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీనిని నిర్దేశించుకున్నట్లు మోడీ చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాల్ని కల్పించేందుకు అవసరమైన సత్తా ఉందన్నారు. పర్యాటకం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో ఉద్యోగాలు సృష్టించవచ్చునని చెప్పారు. ఈ రంగాలను ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
ఇలా చేయండి...
ఈ సందర్భంగా నిపుణులు ప్రభుత్వానికి వివిధ సూచనలు చేశారు. రుణ వితరణ పెంచాలని, ఎగుమతుల వృద్ధి, PSB పాలన, ఉద్యోగ సృష్టి, వినియోగం పెంచే అంశంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. స్వల్పకాలంలో అమలు చేయదగ్గ సలహాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని, దీర్ఘకాలంలో అమలు చేయాల్సిన వాటిని వీలును బట్టి నిర్మాణాత్మక సంస్కరణల రూపంలో తీసుకు వస్తామని మోడీ చెప్పారు.
సూచనలివ్వండి..
2020-21 బడ్జెట్పై ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. mygov.in ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని ట్వీట్ చేశారు. 130 కోట్ల మంది ఆకాంక్షలను ప్రతిబింబించే కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని, మీరంతా ఈ సంతవ్సర బడ్జెట్కు సంబంధించి వ్యవసాయం, విద్య రంగాలపై ఆలోచనలు, సూచనలు ప్రభుత్వంతో పంచుకోండని మోడీ ట్వీట్ చేశారు.