Budget 2021: 'V' షేప్ రికవరీ, రెండేళ్లలో వృద్ధి ఎలా ఉంటుందంటే?
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11.5 శాతంగా నమోదు కావొచ్చునని ఆర్థిక సర్వే పేర్కొంది. బడ్జెట్ సమావేశాలు నేడు (జనవరి 29 శుక్రవారం) ప్రారంభమయ్యాయి. తొలుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యాహ్నం నిర్మలమ్మ ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. ఈ దశాబ్దంలో ఇవి తొలి బడ్జెట్ సెషన్స్ కాగా, నేడు తొలి సెషన్. ఆర్థిక సర్వే ప్రకారం...
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
వీ షేప్ రికవరీ
కరోనా సమమయంలో వ్యవసాయం ఆశాజనకంగా ఉంది. కాంటాక్ట్ బేస్డ్ సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు మాత్రం కరోనా వల్ల దెబ్బతిన్నాయి. కరోనా వల్ల దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీలో ఉంది. అన్ని రంగాలు కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయరంగం మాత్రం వృద్ధిని నమోదు చేసింది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రానున్న రెండేళ్ళలో దేశీయ ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకోనుంది. పదిహేడేళ్లలో తొలిసారి 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు రెండు శాతంగా ఉంటుంది.
వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ
కరోనా నుండి వేగంగా కోలుకుంటున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఆరోగ్య సంరక్షణ మార్కెట్ నిర్మాణాన్ని చురుగ్గా రూపొందించడంలో ప్రభుత్వానిది ముఖ్య పాత్ర. నిరుపేదల్ని పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్రం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే సూచించింది.
హెల్త్ కేర్ పైన దృష్టి
కరోనాతో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి సారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలు అవసరమని సూచించింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో అలనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని పెంచాలని తెలిపింది. కాగా, కరోనా నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు కుదించారు. శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాదాపు 20 పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.