నరేంద్రమోడీ వల్లే అవుతుంది: బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్య
దేశీయ బ్యాంకుల రిక్యాపిటలైజ్ లేకుంటే భారత ఆర్థిక రికవరీ తీవ్రంగా దెబ్బతింటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్, సీ రంగరాజన్ హెచ్చరించారు. బ్యాంకులకు పెరుగుతున్న బ్యాడ్ రుణాలు దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదాన్ని కలిగస్తాయన్నారు. ఇందులో కొన్నింటిని బ్యాంకులు తిరిగి పెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, లేదంటే దేశఆర్థిక రంగానికి హితం కాదన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలు సూచనలు చేస్తున్నారు.
మారటోరియం వడ్డీ మాఫీ: వీరికి ఎక్స్గ్రేషియా ఊరటలేదు... కేంద్రం స్పష్టత
ప్రభుత్వం ఆదుకోకపోతే..
దేశీయ బ్యాంకుల ఎన్పీఏలు ఏ దేశంలోను లేనంత భారీస్థాయికి పెరిగాయని ఆర్బీఐ మాజీ గవర్నర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల నిరర్థక ఆస్తులతో ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. బ్యాంకులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యమవుతుందన్నారు. ఈ మేరకు ఓ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ రాసిన 'పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ' పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలో దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్, వైవీరెడ్డి, సీ రంగరాజన్ల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
వీటితో తీవ్ర సంక్షోభం
కంపెనీల మితిమీరి పెట్టుబడులు, బ్యాంకర్లు అతిగా వ్యవహరించడం, వేగంగా స్పందించలేకపోవడం ఎన్పీఏల పెరుగుదలకు ప్రధాన కారణాలని మాజీ గవర్నర్లు అన్నారు. కేవలం మొండి బాకీలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా బ్యాంకులను తీవ్రంగా వేధిస్తున్నాయన్నారు. బ్యాంకులకు ఎన్పీఏలే నిజమైన సవాల్ అని, దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పెద్ద నోట్లరద్దు వంటి కొన్ని విధాన నిర్ణయాలు బ్యాంకుల్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు.
నరేంద్ర మోడీ వల్లే అవుతుంది
కేంద్రం ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక దశాబ్దకాలంలో ప్రయివేటీకరించే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బారావు అన్నారు. బ్యాంకుల స్థిరీకఱణ అనేది తాత్కాలికంగా దృష్టి మరల్చే చర్య తప్పించి మరొకటి కాదన్నారు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, కఠినమైన నిర్ణయాలను తీసుకోగలరని, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించడం ఆయన వల్లే అవుతుందన్నారు.
బ్యాంకులను పూర్తిగా ప్రయివేటీకరించడమే అత్యుత్తమ మార్గం అన్నారు. కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. పెద్ద మార్పు ఒకేసారి సాధ్యం కాదని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. 10 ఏళ్ల ప్రణాళికను రూపొందించి, 2030 నాటికి బ్యాంకులన్నింటినీ ప్రయివేటీకరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పది ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేపట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థతుల్లో రుణాల జారీ, ఎన్పీఏలపై కాకుండా విలీన అంశాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.