Year Ender 2020: భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. భారత్కు మినహాయింపు ఏమీలేదు. 2020 క్యాలెండర్ ఏడాదిలో అగ్ర ఆర్థిక వ్యవస్థలు చైనా, అమెరికాల ఆర్థికస్థితి మార్చి త్రైమాసికంలో దారుణంగా క్షీణించాయి. చైనా రెండో క్వార్టర్ నుండే కోలుకుంది. అమెరికా, భారత్ సహా ఏ దేశమూ అంతవేగంగా కోలుకోలేదు. ఆయా దేశాల వృద్ధి రేటు మైనస్లలోకి వెళ్లిపోయింది. రెండో త్రైమాసికంలో అమెరికా జీడీపీ మైనస్ 32 శాతం దాటగా, జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 24 శాతం క్షీణించింది. బ్రిటన్ సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరిన్ని కథనాలు
ఆర్థిక వ్యవస్థలు పతనం
ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలు దశాబ్దాలు, శతాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. స్వతంత్ర భారతానికి ఇదే దారుణ ఆర్థిక పతనమని, జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధిరేటు ప్రతికూలంగా నమోదు కావడంతో టెక్నికల్గా దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్లేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్గా ఆర్థిక సంక్షోభం అన్నప్పటికీ, సెప్టెంబర్ నుండి ఆర్థిక కార్యకలాపాలు కోలుకోవడం గమనార్హం. అంతేకాకుండా, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం నమోదు కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో సంకోచం తగ్గి, మైనస్ 7.5 శాతంగా నమోదయింది. మైనస్ 10 శాతం నుండి అంతకంటే పెరుగుతుందని ఆర్థికవేత్తలు భావించారు. కానీ ఫలితాలు కాస్త సానుకూలంగా ఉన్నాయి.
ఆర్థిక రికవరీ సంకేతాలు
గత మూడు నెలలుగా ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. భారత్లో ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి కనిపిస్తోందని అంటున్నారు. జీఎస్టీ కలెక్షన్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా రెండు నెలలు రూ.1 లక్ష కోట్లు దాటాయి. మూడ నెలలుగా ఆటో సేల్స్ పెరుగుతున్నాయి. పీఎంఐ మూడు నెలలుగా 50 కంటే పైన ఉంది. ఇవన్నీ ఆర్థిక రికవరీకి సంకేతాలు. V షేప్ రికవరీ కనిపిస్తోందని చెబుతున్నారు.
రికవరీ అయినా.. ఇబ్బందులు
భారత్లో ఆర్థిక రికవరీ వేగంగా ఉంది. అయినప్పటికీ మరికొన్ని త్రైమాసికాలు వృద్ధి రేటు మైనస్లలోనే ఉంటుందని, పూర్తి సంవత్సరానికి మైనస్ 7 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా బ్యాంకులపై తీవ్రమైన దెబ్బ పడుతోందని, రెండేళ్లలో మూలధనం క్షీణించవచ్చునని ఆర్థిక నిపుణులు, ఆర్థిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.