FY22 ఆర్థిక వృద్ధిరేటు బౌన్స్ బ్యాక్, కరోనా ముందుస్థాయికి
కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కూడా భారత ఆర్థిక రంగ వృద్ధిపై స్పందించారు. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థ బౌన్స్ బ్యాక్ అవుతుందని పేర్కొన్నారు. 2021-22 చివరి నాటికి మనం కచ్చితంగా ప్రీకోవిడ్ స్థాయికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు మైనస్ 8 శాతంగా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
అది ఆర్బీఐ నిర్ణయం కాదు: ఆ కీలక ప్రతిపాదన నుండి శక్తికాంతదాస్ దూరం!
ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు
భారత్ రికవరీ ఊహించినదానికంటే వేగంగా ఉందని రాజీవ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.5 శాతానికి సవరించింది ఆర్బీఐ. ఇప్పుడు రాజీవ్ కుమార్ కూడా దాదాపు అదే (మైనస్ 8 శాతం) అంచనా వేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 7.5 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే. మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతంగా నమోదయింది. 1996 నుండి త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటి నుండి ఇదే కనిష్టం.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా..
పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని రాజీవ్ కుమార్ చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ఇందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుందని, ఇందులో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరించాలని భావిస్తోంది. అయితే కరోనా వల్ల ఇది ఆలస్యమవుతోంది.
బ్యాంకింగ్ సేవల విస్తరణ
బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ అన్నారు. జీడీపీలో ప్రయివేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగా ఉందన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి వంద శాతానికి పైగా ఉందన్నారు. వ్యవసాయరంగంలో రసాయనరహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి అయోగ్ దృష్టి సారించిందన్నారు.