తగ్గింది కరోనా కాదు, జీడీపీ: లాక్డౌన్పై రాజీవ్ బజాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి పడిపోయిందని, దీనిని తిరిగి పొందడం అంత సులభమేమీ కాదని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. కరోనా-లాక్ డౌన్ అంశంపై రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
కరోనా టైమ్లో ఈ కంపెనీలో 15% శాలరీ హైక్, పైగా బోనస్ కూడా
లాక్ డౌన్ లోపభూయిష్టం
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ అత్యంత కఠినమైన లాక్ డౌన్ను అమలు చేసిందని రాజీవ్ బజాజ్ అన్నారు. ఈ లాక్ డౌన్ లోపభూయిష్టమని చెప్పారు. కరోనా ఇన్ఫెక్షన్ తగ్గడానికి బదులు దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధి రేటు కుదేలయ్యాయన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం ఎంతో సంక్లిష్టమైన వ్యవహారమన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను వెంటనే తొలగించాలన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత స్పష్టమైన వివరణలతో ప్రజల ముందుకు రావాలన్నారు.
కఠినమైన లాక్ డౌన్ విధానాలు
'కఠినమైన లాక్ డౌన్ను అమలు చేసేందుకు మనం ప్రయత్నించాం. కానీ ఇది లోపభూయిష్టంగా ఉండటంతో రెండు విధాలా నష్టపోయామని నేను భావిస్తున్నాను. అన్లాకింగ్ దిశగా మనం సరైన ప్రణాళికతో సజావుగా ముందుకెళ్తున్నట్టు కనిపించడం లేదు. కరోనా ముప్పు ఇప్పటికీ ఉందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవగానే అది మనలను కాటేసేందుకు సిద్ధంగా ఉందని, కరోనా సమస్య తగ్గలేదని' రాజీవ్ బజాజ్ చెప్పారు.
కరోనాకు బదులు జీడీపీ కర్వ్ కుదేలు
మరోవైపు మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ఛిన్నాభిన్నమైందని, కరోనా కర్వ్కు బదులుగా జీడీపీ కర్వ్ కుదేలయిందని రాజీవ్ బజాజ్ అన్నారు. దీంతో మనం రెండు విధాలా నష్టపోయామని, లాక్ డౌన్తో మనం సాధించింది ఇదేనని వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు భారత్ ఆర్థిక వ్యవస్థ డీలా పడటం కాదని, ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లిందన్నారు.