అమెరికా కంపెనీతో వివాదానికి స్వస్తీ, డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం: అందుకే స్టాక్స్ దూకుడు
అమెరికాకు చెందిన బ్రిస్టోల్ మైర్స్ స్కిబ్స్ యూనిట్ సెల్జీన్తో పేటెంట్ వివాదాన్ని పరిష్కరించుకుంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్. క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే రెవ్లిమిడ్ క్యాప్సుల్స్ పేటెంట్ హక్కులపై రెండు సంస్థల మధ్య గతంలో వివాదం తలెత్తింది. ఈ అంశాన్ని ఇప్పుడు పరిష్కరించుకుంది. అంతకుముందు రష్యా స్నుత్నిక్-వీపై డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.
భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతి లభించిన తర్వాత 10 కోట్ల డోసుల వ్యాక్సీన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ సరఫరా చేయనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్లు రెండు మూడు రోజులుగా ఎగుస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి షేర్ ధర దాదాపు 10 శాతం లాభపడి రూ.5,287 పలికింది.
సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి ఊరట, కానీ అక్టోబర్ 6న ఫైనల్!
ఏమిటీ వివాదం.. ఏం జరిగింది?
సేల్స్పరంగా ప్రపంచంలోని టాప్ 10 ఔషధాల్లో రెవ్లిమిడ్పై సెల్జీన్కు పేటెంట్ ఉంది. ఇదే ఔషధాన్ని అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ సిద్ధమైంది. దీంతో వివాదం తలెత్తింది. ఇప్పుడు ఈ కంపెనీలు సర్దుబాటు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 2022 మార్చి తర్వాత అమెరికాలో రెవ్లిమిడ్ జనరిక్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ విక్రియంచవచ్చు. ఎంత మేరకు విక్రయించాలనే పరిమితి కూడా తాజా ఒప్పందంలో ఉంది. 2026 జనవరి 31 తర్వాత పరిమితి లేకుండా ఔషధాన్ని విక్రయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా అవసరమైన అనుమతులను తీసుకొని ఈ ఔషధాన్ని మార్కెట్కు అందిస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ ఔషధాన్ని క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు.
అందుకే ఇన్వెస్టర్ల ఆసక్తి
రెవ్లిమిడ్కు సంబంధించి సెల్జీన్తో ఇలాంటి ఒప్పందం నాట్కో ఫార్మాకు కూడా ఉంది. రెండేళ్ల క్రితం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. నాట్కో ఫార్మా రెవ్లిమిడ్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ తాత్కాలిక అనుమతి కూడా ఉంది. కరోనా వ్యాక్సీన్ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కారమైనట్లు గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్లో డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
టార్గెట్ ధర పెంపు
ఇదిలా ఉండగా, ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) విభాగానికి చెందిన కంటి అలర్జీకి చికిత్సలో అందించే ఓలోపటడైన్ హైడ్రోక్లోరైడ్ఆప్తాల్మిక్ సొల్యూషన్ను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. ఇదిలా ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టార్గెట్ ధరను బ్రోకరేజీ సంస్థలు పెంచాయి. రూ.5100 నుండి రూ.5,750కి పెంచాయి.