డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్స్ దూకుడు .. ఆరునెలల్లో 100 శాతం .. రీజన్ ఇదే
అమెరికా కంపెనీతో వివాదం పరిష్కరించుకున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మార్కెట్ లో దూసుకుపోతుంది . షేర్ ధర గత ఆరు నెలల్లో దాదాపు వంద శాతం పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాడు బి ఎస్ ఈ 10.36 శాతం లాభంతో 5326. 70 వద్ద ముగిసింది. ఎన్ ఎస్ఈ లో 9.9 శాతం లాభంతో 5306 రూపాయల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 13.88 శాతంతో లాభపడింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్ ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి.
అమెరికాకు చెందిన బ్రిస్టల్-మైయర్స్ స్క్విబ్ కో యొక్క యూనిట్ అయిన సెల్జీన్తో మందుల తయారీదారు అయిన డాక్టర్ రెడ్డీస్ పేటెంట్ దావాను పరిష్కరించుకున్న తరువాత డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ షేర్లు ఊహించని విధంగా పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే రెవ్లిమిడ్ (లెనాలిడోమైడ్) క్యాప్సూల్స్కు పేటెంట్లకు సంబంధించిన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ యూనిట్తో వ్యాజ్యాన్ని పరిష్కరించుకుందని చెప్పారు. సెల్జీన్ యొక్క క్యాన్సర్ డ్రగ్ రెవ్లిమిడ్ జూన్-త్రైమాసిక అమ్మకాలలో 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసిందని రాయిటర్స్ నివేదించింది.
గత నాలుగు రోజులుగా వివాద పరిష్కారం తో, కంపెనీ చేసిన సానుకూల ప్రకటనలతో లాభాల బాటలో నడుస్తోంది డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్. రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ పై అంతకుముందు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతి వచ్చిన తర్వాత పదికోట్ల డోసులు వ్యాక్సిన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సరఫరా చేయనుంది. ఇక ఈ నేపథ్యంలోనే పలు సానుకూల ప్రకటనల మధ్య డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్లు గణనీయంగా పెరిగాయి.