కరోనా వల్ల ఆర్థిక మాంద్యంలోకి, ఆగస్ట్ వరకు సంక్షోభం: ట్రంప్, ఫ్రాన్స్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని ఆ దేశ ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం కనబడని శత్రువుతో పోరాడుతున్నామని, నెల రోజుల కిందటి వరకు ఈ మహమ్మారి గురించే మనకు తెలియదని, ఇప్పుడు ఈ ప్రభావం ఆగస్ట్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అప్పటి దాకా కొనసాగుతుందా లేదా వెంటనే ఆగుతుందా చూడాలని, ఈ మహమ్మారి గురించి అప్పుడే ఏమీ చెప్పలేనిస్థితి అన్నారు.
రూ.4,000 డౌన్! భారీగా తగ్గిన బంగారం ధర, 1983 తర్వాత ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
ఆగస్ట్ వరకు ఆగేలా కనిపించట్లేదు
ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, అన్నింటికీ నిధులు సమకూర్చాలని, అందువల్ల మాంద్యం తప్పనట్లుగా కనిపిస్తోందని ట్రంప్ అన్నారు. కరోనా సంక్షోభం ఆగస్ట్ వరకు కొనసాగే ముప్పు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ కారణంగా అమెరికా మాంద్యం దిశగా అడుగులు వేస్తుందేమో కానీ ఆ తర్వాత కోలుకుంటుందన్నారు.
మార్కెట్ కాదు.. వైరస్ కట్టిపై దృష్టి
ప్రస్తుతం తాము మార్కెట్ గురించి ఆలోచించడం లేదని, వైరస్ను ఎలా కట్టడి చేయాలనే అంశంపై దృష్టి సారించామని ట్రంప్ చెప్పారు. విదేశీ ప్రయాణాలపై కట్టడి చేయడంతో విమానయాన సంస్థలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, ఆ రంగానికి అండగా ఉంటామన్నారు. ప్రస్తుతానికి దేశంలో కర్ఫ్యూ విధించే ఆలోచన లేదన్నారు.
ట్రంప్ మార్గదర్శకాలు
వైరస్ నేపథ్యంలో 850 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రతిపాదనలను ట్రంప్ కాంగ్రెస్ ముందు ఉంచబోతున్నారు. ఇది ట్రిలియన్ డాలర్లుగా కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. తొలిసారిగా వైరస్ తీవ్రతను గుర్తిస్తూ ఆయన అమెరికన్లకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. పదిమంది కంటే ఎక్కువ మంది ఎక్కడా గుంపుగా చేరకూడదన్నారు. సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, బయట రెస్టారెంట్లు, బార్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సూచనలన్నీ నేటి నుండే పాటించాలని, ప్రయాణాలు వద్దని, స్కూల్స్ క్లోజ్ చేయాలన్నారు.
ఫ్రాన్స్ కీలక నిర్ణయం
కరోనా కారణంగా దివాలా ముప్పు నుండి రక్షించేందుకు తమ దేశంలోని పలు పెద్ద కంపెనీలను జాతీయం చేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లె మయిర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు గాను 50 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మరోవైపు ఇటలీలో ఇప్పటికే దివాలా తీసిన అలిటలియా విమానయాన సంస్థను తిరిగి జాతీయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా నష్టపోతున్న కుటుంబాలు, వ్యాపార సంస్థల కోసం 25 బిలియన్ యూరోలను కేటాయించనున్నారు.