సంతోషాలొద్దు.. రికవరీ యాంత్రికమే: ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సానుకూలత సంకేతాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. స్వల్పకాలం నుండి మధ్యకాలానికి భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవన్నారు. ఇటీవల కొంత సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని, వీటి గురించి మరీ ఎక్కువగా స్పందించవద్దని, ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో పూర్తిగా కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అన్-లాక్ కావడంతో ఎంతో కొంత కోలుకుంటున్నట్లు కనిపించడం సహజమేనని గుర్తు చేశారు. ఇది కొనసాగుతుందనుకోలేమని అభిప్రాయపడ్డారు.
ఆపిల్ కీలక నిర్ణయం: ఇండియాలో iPhone 12 ఉత్పత్తి, బెంగళూరులో 10,000 ఉద్యోగాలు
ఇది యాంత్రికంగా కోలుకోవడమే
లాక్ డౌన్ సమయంలో పూర్తిగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు, ఇప్పుడు కాస్త సానుకూలంగా కనిపించడం సహజమేనని, దీనిని యాంత్రికంగా కోలుకోవడం అని చెప్పవచ్చునని దువ్వూరి సుబ్బారావు అన్నారు. దీనిని చూసి కరోనా నుండి బయటపడి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, అభివృద్ధి బాటలోకి ఎక్కినట్లు ఇప్పుడే భావించడం సరికాదన్నారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎంత సమర్థంగా ఎదుర్కోగలమనే అంశంపై ఆర్థిక పునరుజ్జీవనం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ద్రవ్యలోటు, రుణభారం భరించలేనిదిగా...
కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ కాస్త క్షీణించిందని దువ్వూరి సుబ్బారావు గుర్తు చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7%, 2018-19లో 6.1% కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 4.2% పడిపోయిందని గుర్తు చేసిన ఆర్బీఐ
మాజీ గవర్నర్... సానుకూల సంకేతాలపై మితిమీరిన ఆశలు వద్దని, లాక్డౌన్ అనంతర కాలంలో ఏర్పడిన యాంత్రికమైన పరిణామం మాత్రమేనని, అది దీర్ఘకాలిక రికవరీ సంకేతంగా భ్రమింపచేస్తోందన్నారు. కరోనా పూర్తిగా మాయమయ్యే సమయానికి ప్రస్తుత సమస్యలు మరింత పెద్దగా కనిపిస్తాయని, ద్రవ్య లోటు, రుణభారం భరించలేని భారంగా మారడంతో పాటు ఆర్థిక పరిస్థితి జఠిలంగా ఉండవచ్చనన్నారు.
ప్రభుత్వం ఖర్చు చేస్తేనే..
రోజువరీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని, స్వల్పకాలం నుండి మధ్యకాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగా ఉన్నట్లు చెప్పారు దువ్వూరి సుబ్బారావు. మహమ్మారి తర్వాత సమస్యలు మరింతగా పెరిగే అవకాశముందన్నారు. ఎదుర్కోబోయే ఆర్థిక సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటామనే దానిపై మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదన్నారు. వృద్ధికి ఆధారమైన ప్రయివేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు క్షీణించాయని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం మరింత ఖర్చు చేయాలని, లేదంటే మొండి బకాయిలు సహా పలు ఆర్థిక సమస్యలు వస్తాయన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిరుదివ్వె
ప్రస్తుత నిరాశ, నిస్పృహ పరిస్థితుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం మాత్రమే చిరుదివ్వెగా కనిపిస్తోందని సుబ్బారావు అన్నారు. రికవరీ పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో బాగుందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాది హామీ పథకం సహా పలు కారణాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్య అన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువమంది గుర్తించిన మరో సానుకూల అంశమని చెప్పారు. నాలుగు కోట్లకు పైగా పట్టణ కార్మికులు గ్రామాల్లోకి వెళ్లారని, కానీ అక్కడ భారీ కేసులు నమోదు కాలేదన్నారు.