హ్యుండాయ్ తర్వాత, డామినోస్, హోండా కూడా: భారత్కు సారీ
కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ డీలర్లు చేసిన వివాదాస్పద ట్వీట్స్ పైన సంబంధిత కంపెనీలు క్షమాపణలు చెబుతున్నాయి. ఇప్పటికే హ్యుండాయ్ పాకిస్తాన్ చేసిన ట్వీట్ పైన ఆ కంపెనీ స్పందించింది. కొరియా విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్కు ఫోన్ చేసి పశ్చాత్తాపం ప్రకటించారు. ఇప్పుడు పిజ్జా తయారీ సంస్థ డామినోస్, జపాన్కు చెందిన వాహన కంపెనీ హోండా కూడా బుధవారం భారత్కు క్షమాపణలు చెప్పాయి. భారత ప్రజల సెంటిమెంటును, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపాయి.
తాము పాతికేళ్లుగా భారత్లో ఉన్నామని, ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, జాతియతా స్ఫూర్తిపై తమకు అమితమైన గౌరవం ఉందని, దేశ ఔన్నత్యాన్ని తాము గౌరవిస్తున్నామని, దేశం వెలుపలి నుండి డామినోస్ సోషల్ మీడియా వేదికలపై దర్శనమిచ్చిన అనుచిత సందేశాలకు తాము క్షమాపణ చెబుతున్నామని డామినోస్ తెలిపింది. భారత్ను గౌరవిస్తూ ఇక్కడి వినియోగదారులకు వినియ, విధేయతలతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
తమ కార్యకలాపాలు కొనసాగుతున్న ప్రతిదేశంలో అక్కడి నియమ, నిబంధనలను అనుసరించేందుకు కట్టుబడి ఉన్నామని, దీనికి భంగం కలిగితే చింతిస్తున్నామని, కంపెనీ నిబంధనల ప్రకారం జాతి, మత, రాజకీయం సహా ఇతర సామాజిక అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, దీనిని సంస్థకు చెందిన వారంతా కట్టుబడి ఉండాలని తెలిపింది. ప్రత్యేక కాశ్మీర్కు మద్దతు తెలుపుతూ డామినోస్, హోండా సోషల్ మీడియా ఖాతాలు ట్వీట్ చేశాయి. దీనిపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పాయి.