Cyber Crime: 5జీకి మారాలంటూ లింక్లు వస్తున్నాయా.. క్లిక్ చేస్తే అంతే సంగతి..
భారత్లోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 5జీ సేవలను అక్టోబర్ 1న నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 13 మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీన్ని అనువుగా మార్చుకోవాలని సైబర్ నేరగాళ్లు భావిస్తున్నారు. '4జీ నుంచి 5జీకి మారాలని మేసేజ్ ల ద్వారా లింకులు పంపుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలా మంది లింక్ లు క్లిక్ చేస్తే అంతే సంగతని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఎయిర్ టెల్, జియో
దేశంలో ప్రధానంగా ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థలు ఉన్నాయి. వీడియోలో ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో మాత్రమే పలు నగరాల్లో 5జీ సేవలు అందిస్తోన్నాయి. ఎయిర్ టెల్, జియో సిమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు 'ఏపీకే ఫైల్స్'ను లింకుల ద్వారా గంపగుత్తగా పంపిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
మాల్వేర్
అవి మాల్వేర్ ఫైల్స్ కావడంతో రహస్యంగా సెల్ఫోన్లోకి చొరబడతాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి చొరపడితే వినియోగదారుడి ఫోన్లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చిక్కుతుందని చెప్పారు. అందులో వ్యక్తిగత చిత్రాలు, ఇతర రహస్యాలున్న పక్షంలో వాటిని ఉపయోగించుకుని వాళ్లు బెదిరింపులకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
సిమ్ మార్చాల్సిన అవసరం లేదు
గతంలో 3జీ నుంచి 4జీకి మారినప్పుడు సిమ్ మార్చాల్సి వచ్చేదని... ఇప్పుడా ఆవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.4జీ సిమ్పైనే 5జీ సేవలు పొందే సాంకేతికతను టెలికాం కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయని వివరించారు. సూచనలకు అనుగుణంగా సెల్ఫోన్ సెట్టింగుల్లో మార్పులు చేసుకుంటే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.