రూ.323 కోట్ల నుండి రూ.40 కోట్లకు డౌన్: డిమార్ట్కు కరోనా దెబ్బ, ఏకంగా 88% తగ్గిన లాభం
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో అవెన్యూ సూపర్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్(డీ-మార్ట్) ప్రాఫిట్ 87.61 శాతం తగ్గి రూ.40 కోట్లకు పడిపోయింది. ఏడాది ప్రాతిపదికన ఈ మేరకు లాభం తగ్గినట్లు శనివారం వెల్లడించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.323 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అది నలభై కోట్ల రూపాయలకు తగ్గడం గమనార్హం. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 5,815 శాతం నుండి 33.21 శాతం తగ్గి రూ.3,883కు పడిపోయింది.
ఎకానమీ రికవరీపై శుభవార్త, ఇక మారటోరియం పొడిగింపు అవసరంలేదు
కరోనా-లాక్ డౌన్
ప్రాఫిట్ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 450 బేసిస్ పాయింట్లు తగ్గి 1 శాతంగా ఉందని తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ప్రాఫిట్ మార్జిన్ 5.5 శాతంగా ఉంది. కరోనా కారణంగా డిమాండ్ తగ్గడంతో పాటు లాక్ డౌన్ ప్రభావం పడినట్లు తెలిపింది. కరోనా-లాక్ డౌన్ ఆంక్షలు తమ ఆపరేషనల్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పైన ఈ క్వార్టర్లో పెను ప్రభావం చూపాయని పేర్కొంది. గత ఏడాది కంటే తమ రెవెన్యూ, ఎబిటా, ప్రాఫిట్ గత ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే పడిపోయిందని కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లో నోరోన్హా అన్నారు.
మార్జిన్లపై ఈ ప్రభావం
కరోనా నేపథ్యంలోను తమకు స్టోర్స్ తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చిన చోట మాత్రం సేల్స్ కరోనా కంటే ముందు ఉన్న అమ్మకాలతో పోలిస్తే 80 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కరోనా కారణంగా కస్టమర్ వినియోగ తీరులో మార్పు కనిపిస్తోందని, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీయేతర కేటగిరీల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉందని తెలిపింది. ఇది స్థూల మార్జిన్లను ప్రభావితం చేస్తోందని పేర్కొంది. కరోనా లాక్ డౌన్ వల్ల నగరాల్లో స్టోర్ కార్యకలాపాలు, కార్యకలాపాల సమయం తగ్గిందని పేర్కొంది. కొన్ని నగరాల్లో అధికారులు నిత్యావసర వస్తువుల అమ్మకానికి మాత్రమే అనుమతించారని తెలిపింది. కరోనా కారణంగా మరింత కాలం ఆదాయాలపై ప్రభావం ఉంటుందని చెప్పింది.
ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం..
ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్థానిక అధికారులకు సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని కంపెనీ తెలిపింది. అలాగే తమ ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే.