డీమార్ట్ లాభం 16 శాతం జంప్, రేపటి స్టాక్పై అందరి దృష్టి
2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డిమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ నికర లాభం 16.39 శాతం వృద్ధి సాధించింది. కన్సాలిడేట్ ఖాతాల ప్రకారం నికర లాభం రూ.446.95 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.384.10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ మొత్తం ఆదాయం 10.77 శాతం వృద్ధి చెంది రూ.7542 కోట్లకు చేరుకుంది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.6,808.93 కోట్లుగా ఉంది. వ్యయాలు 10.32 శాతం పెరిగి రూ.6325 కోట్ల నుండి రూ.6998 కోట్లకు చేరుకుంది. స్టాండలోన్ పద్ధతిలో కంపెనీ నికర లాభం 19.27 శాతం పెరిగి రూ.470.25 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ ఈ త్రైమాసికంలో మెరుగ్గా ఉంది. ఎబిటా ముందు ఆదాయాలు సంవత్సరానికి 15.5 శాతం పెరిగి రూ.689.12 కోట్లకు చేరుకున్నాయి. మార్జిన్ విస్తరణ 9.14 శాతంగా ఉంది.
పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల కంటే మెరుగైన లాభాలు నమోదయ్యాయని సంస్థ సీఎండీ తెలిపారు. కరోనా ముందుస్థాయి అమ్మకాలకు చేరువలో ఉన్నట్లు తెలిపారు. దుస్తులు, ప్రయాణ సంబంధ వస్తువులు, పాదరక్షలు వంటి వాటికి డిమాండ్ పెరగడానికి ఇంకొంత సమయం పడుతుందన్నారు.
ఎఫ్ఎంసీజీయేతర రంగం నుండి సప్లై కొరత, ముడి సరుకు ధరలు పెరిగాయన్నారు. ఇవి మార్జిన్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు. డీమార్ట్ ఆదాయం, లాభాలు పెరిగిన నేపథ్యంలో ఈ స్టాక్స్ పైన అందరి దృష్టి ఉంది. సోమవారం డిమార్ట్ స్టాక్ భారీగా లాభపడే అవకాశముంది.