చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం: రూ.లక్షకోట్లను దాటేసిన దీపావళి అమ్మకాలు
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ల సమయంలో కళకళలాడాల్సిన మార్కెట్లు బోసి పోయాయి. కొనుగోలుదారులతో సందడిగా సాగాల్సిన వ్యాపార కేంద్రాలు లాక్డౌన్ వల్ల రోజుల తరబడి మూత పడ్డాయి. వ్యాపారస్తులు చితికిపోయారు. అటు కొనుగోలుదారులు కూడా తమ అవసరాలకు అనుగుణంగా దుస్తులు, వస్తువులను కొనలేకపోయారు.
నో కేవైసీ..నో పాన్: బ్యాంకులో 1200 ఫేక్ అకౌంట్స్: కోట్ల రూపాయలు సీజ్
లక్ష కోట్ల మార్క్ క్రాస్..
ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత, రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. మార్కెట్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. దసరా, దీపావళి పండగ సీజన్లలో దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. ఇ-కామర్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తోడు కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అంచనాలకు మించిన స్థాయిలో కనిపించింది మార్కెట్ దూకుడు. లక్ష కోట్ల రూపాయల మార్క్ను దాటిందంటే.. దాని జోరు ఏ స్థాయిలో కనిపించిందో అర్థం చేసుకోవచ్చు.
పదేళ్ల రికార్డ్ బ్రేక్..
ఈ ఏడాది దీపావళి ఫెస్టివ్ సీజన్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంగా లక్షా 25 వేల కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు, కొనుగోళ్లు రికార్డయ్యాయి. దీపావళి సీజన్లో ఈ స్థాయిలో వ్యాపారాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు నమోదు కాలేదు. 10 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసింది. సరైన సమయంలో.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చోటు చేసుకోవడం మార్కెట్ను పునరుజ్జీవింపజేసిందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది.
సీఏఐటీ రిపోర్ట్..
దేశవ్యాప్తంగా 70 లక్షలమందికి పైగా ట్రేడర్లు.. సభ్యులుగా ఉన్న ఈ అసోసియేషన్ ఇది. లక్షా 25 వేల కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు రికార్డు కావడం కోట్లాదిమంది ట్రేడర్లకు ఊపిరిపోసిందని పేర్కొంది. ఒక్క దేశ రాజధానిలోనే 25,000 కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భాటియా, సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుందని, మరోసారి మార్కెట్లన్నీ సందడిగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
దేశీయ వస్తువులకు డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్ ముగిసే సమయానికి మరిన్ని కొనుగోళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ దీపావళి సీజన్లో దేశీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ లభించిందని చెప్పారు. చైనా వస్తువుల జోలికి వెళ్లకపోవడం వల్ల ఆ దేశానికి కనీసం 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. పండగ సీజన్లో ప్రజలు బంగారం ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపారని, ఫలితంగా వాటి అమ్మకాలు 9,000 కోట్ల రూపాయలను దాటాయని పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారని, ఈ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 23 శాతం పెరిగాయని సీఏఐటీ ప్రతినిధులు తెలిపారు.
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా..
ఆన్లైన్ సైట్ల ద్వారా 32,000 కోట్ల రూపాయల విలువ గల వస్తువులు అమ్ముడుపోయాయి. ఈ దఫా ఫ్లిప్కార్ట్ మెజారిటీ వాటాను సాధించింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ 64 శాతం మార్కెట్ వాటాతో టాపర్గా నిలిచిందని రెడ్సీర్ తన నివేదికలో తెలిపింది. ఈ ఫెస్టివ్ సీజన్లో గ్యాడ్జెట్లను కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కొనుగోలుదారులు. 5జీ బేస్డ్ స్మార్ట్ ఫోన్లు పెద్ద ఎత్తున విక్రయం అయ్యాయి. అమెజాన్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 84 శాతం ఈ కేటగిరికి చెందినవే.