డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 48% జంప్, అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 41%
భారత పన్ను వసూళ్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. పర్సనల్, కార్పోరేట్ ఆదాయపు పన్నుల వసూళ్లు 48 శాతం పెరిగాయి. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 41 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. కరోనా ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుందని చెప్పడానికి ఈ వసూళ్లు నిదర్శనం. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2022 మార్చి 16వ తేదీ వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందు అంచనా వేసిన రూ.11.08 లక్షల కోట్లు, 2022-23 బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్న సవరించిన అంచనా రూ.12.50 లక్షల కోట్లను ఇప్పటికే అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.9.18 లక్షల కోట్లు మాత్రమే. వ్యక్తుల ఆదాయంపై పన్ను, కంపెనీల లాభాలపై కార్పోరేట్ పన్ను, స్థిరాస్తి పన్ను, వారసత్వపు పన్ను, బహుమతి పన్ను.. వీటిని ప్రత్యక్ష పన్నుగా పేర్కొంటారు.
కరోనాకు ముందు అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.9.56 లక్షల కోట్లతో పోల్చినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం పెరిగింది. మార్చి 15వ తేదీతో గడువు ముగిసిన నాలుగో వాయిదాకు సంబంధించి ముందస్తు పన్నుల వసూళ్లు రూ.40.72 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.87 లక్షల కోట్లను రీఫండ్స్గా ఆదాయపు పన్ను విభాగం జారీ చేసింది.