ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి, అప్పుడే బయటపడతాం: సత్య నాదెళ్ల
ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు చేతులు కలిపితే వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఇలా చేయడం వల్ల వేగవంత వృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం, ప్రయివేటు రంగాలు, ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరమని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వ్యాపారాలను మార్చి వేస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం కూడా వ్యాపారాలపై ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి
ప్రభుత్వరంగ సంస్థలు వ్యవస్థాగతంగా బలంగా ఉండటం ఎంతో అవసరమని సత్య నాదెళ్ల అన్నారు. ఆయన ఫిక్కీ ఏజీఎంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని అని, కాబట్టి ప్రభుత్వ రంగంపై కొంత అవగాహన ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని, ప్రస్తుతం దేశంలో ఈ దిశగా కొంత కసరత్తు జరుగుతోందన్నారు. మార్పులను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు. మార్పులు సంపూర్ణంగా ఉండాలన్నారు.
ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం అవసరం
కరోనా కారణంగా దెబ్బతిన్న వర్ధమాన దేశాలు పుంజుకోవాలంటే ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం అవసరమన్నారు. వేగవంతమైన వృద్ధికి కూడా ఇది అవసరమన్నారు. కరోనా సమయంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. వ్యాపారాల నిర్వహణకు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఆర్థిక సేవల నుండి ఆరోగ్య సంరక్షణ, రిటైల్ వరకు అన్ని రంగాల్లో డిజిటల్ మౌలిక వసతులపరంగా భారత్లో వస్తున్న మార్పులను ప్రస్తావించారు.
సహకారం అవసరం
అధునికీకరణలో ప్రభుత్వరంగానికి సహకరించాల్సిన అవసరం ఉందని సత్య నాదెళ్ల అన్నారు. కాగా, కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చాక భారత్కు అపరిమిత అవకాశాలు ఉన్నాయని, వీటని అందిపుచ్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా అన్నారు. డేటా గోప్యత, డేటా నిల్వ, పన్నుల విషయంలో నియంత్రణపరమైన ప్రమాణాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.