సమాచార ప్రైవసీ చాలా ముఖ్యం: కేటీఆర్తో సత్ నాదెళ్ల, వర్క్ ఫ్రమ్ హోంపై ఏమన్నారంటే
సమాచార గోప్యత మానవాళి హక్కు అని, దీనిని కాపాడుకోవడానికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఏకరీతి ప్రమాణాలు ఉండాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. బయో ఏషియో-2121లో భాగంగా మంగళవారం ఆయన ఆన్లైన్ ద్వారా మంత్రి కేటీ రామారావుతో సంభాషించారు. కరోనా వల్ల సాంకేతికత వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని, సమాచార గోప్యతకు ఎన్నడూ లేని ప్రాధాన్యం ఏర్పడిందని సత్య నాదెళ్ల అన్నారు.
మనుషుల జీవితాల్లో, సమాజంలో, ఆర్థిక వ్యవస్థల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం చొచ్చుకు వెళ్తోందని, అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే నిపుణులు, ఆవిష్కరణల దశలోనే సమాచార గోప్యత, భద్రత, నీతివంతమైన ప్రమాణాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...
గోప్యత, భద్రత ముఖ్యం
టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ను, సాధనాలను ఎంతో బాధ్యతతో నిర్మించాలని, సమాచార గోప్యత, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, తాము అదే ఆలోచన చేస్తున్నామని సత్య నాదెళ్ల అన్నారు. ప్రైవసీ నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా వేరువేరుగా ఉన్నాయన్నారు. ఇవి మొదట ఐరోపా దేశాల్లో అమల్లోకి వచ్చాయని, ఆ తర్వాత ఇతర దేశాలు వాటిని అనుసరిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే నిబంధనలు ఉండాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీలు ప్రైవసీకి అనుగుణంగా ఉత్పత్తులు, సేవలు అందించాలన్నారు. గోప్యత అనేది మనిషి హక్కు అన్నారు.
స్టార్టప్స్ కీలక పాత్ర
కరోనా సమయంలో స్టార్టప్స్ క్రియాశీలక పాత్రను పోషించగలుగుతాయని, టెక్నాలజీ నైపుణ్యాన్ని ఉపయోగించి క్లినికల్ పరీక్షలు, ఔషధ పరిశోధనా కార్యకలాపాలను వేగవంతం చేయగలుగుతాయని సత్య నాదెళ్ల అన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానానికి బయోలాజీని జోడిస్తే అద్భుత ఆవిష్కరణలు వస్తాయన్నారు. ఈ విషయంలో స్టార్టప్స్ సంస్థలకు ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు.
వర్క్ ఫ్రమ్ హోంపై సత్య నాదెళ్ల
కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయని, ఈ పద్ధతి ఇకపై కూడా కొనసాగుతుందని, ఐటీ వంటి నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఆరోగ్య రంగంలో పని చేసే వారికీ అందుబాటులోకి వస్తుందని సత్య నాదెళ్ల అన్నారు. కానీ వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు వారి సంక్షేమానికి సంబంధించి మరిన్ని డిజిటల్ టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన హాలోలెన్స్ వంటి పరికరాలతో డాక్టర్లు ఇంటి నుండే రోగులను పరిశీలించి వైద్యం అందించే రోజులు రావాలన్నారు.