'రూ.2000 నోట్లు రద్దు చేయండి, నగదు చెల్లింపుపై పన్నులు, ఛార్జీలు వేయండి'
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి నవంబర్ 8న తేదీ నాటికి మూడేళ్లు. నల్లధన వెలికితీత, బ్లాక్ మనీని అడ్డుకునేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే ఈ నోట్లను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గార్గ్ అభిప్రాయపడ్డారు.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
రూ.2,000 నోట్లు కూడా రద్దు చేయాలి
రూ.2 వేల నోటును కూడా రద్దు చేయాలని ఎస్సీ గార్గ్ అన్నారు. నోట్ల రద్దు అనంతరం తీసుకు వచ్చిన రూ.2,000 నోటుతో పాటు నగదు చలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2వేల నోటును ఎక్కువమంది ఇళ్లలో దాచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. వ్యవస్థలో నగదు చలామణి ఇంకా భారీగానే ఉందని, రూ.2 వేల నోటును దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారత్లో మాత్రం ఇది కాస్త నెమ్మదిగా ఉందన్నారు.
చలామణిలో ఉన్న నోట్లలో మూడోవంతు రూ.2000
ఇప్పుడు దేశంలో చలామణిలో ఉన్న నోట్లలో మూడోవంతు రూ.2,000 నోట్లు అన్నారు. రోజువారి లావాదేవీలకు ఇవి ప్రజలకు అందుబాటులోకి ఉండటం లేదన్నారు. రూ.2000 నోట్లను రద్దు చేయడం లేదా వెనక్కి తీసుకోవడం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలా చేస్తే నోట్లు వెనక్కి
ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గార్గ్ సూచించారు. ఇది ఎంతో మేలైన మార్గామని, దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. రూ.2000 నోటు ఇస్తే, ఆ స్థానంలో నగదు తిరిగి ఇవ్వొద్దనే షరతు పెట్టడం ద్వారా నోట్లు వెనక్కి వస్తాయన్నారు.
నగదు చెల్లింపులపై ఛార్జీలు, పన్నులు వేయండి
ఆర్థిక లావాదేవీలకు అనేక డిజిటల్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని గార్గ్ చెప్పారు. అయినా భారత్లో 85 శాతం నగదు ఆధారిత చెల్లింపులే ఉన్నాయని చెప్పారు. ప్రజలను డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయాలన్నారు. దీంతో నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్నవని ప్రజలు డిజిటల్ వైపు మొగ్గు చూపుతారన్నారు.
చైనా అలా చేసింది..
ప్రభుత్వ వ్యవహారాల్లోను నగదు ట్రాన్సాక్షన్లకు పూర్తిగా స్వస్తీ పలకాల్సి ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలు చేపట్టడంతో ఆ దేశంలో ఇప్పుడు 87 శాతం డిజిటల్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్నారు. రిజర్వ్ బ్యాంకు కూడా బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాలను వ్యవస్థలోకి తీసుకు రావాలన్నారు.