నోట్ల రద్దు వల్ల లాభాలిదిగో.. రూ.3,04,605 కోట్లు నగదును తగ్గించింది
న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1,000 పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రద్దువల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు అంతగా సఫలం కాలేదనే వాదనలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో స్పందించారు. పెద్ద నోట్ల రద్దుకు తోడు డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల చలామణిలోని నగదుకు మరో రూ.3 లక్షల కోట్ల మేర జత చేయడం నివారించినట్లయిందన్నారు.
చైనా కంటే బెట్టర్! మళ్లీ తగ్గిన వాహనాల అమ్మకాలు
ఇప్పటి వరకు నగదు రూ.25,40,253 కోట్లు ఉండాలి
2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య చలామణిలోని నగదు రూ.14.51 శాతం వార్షిక వృద్ధితో పెరిగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే వృద్ధితో సాగితే ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నాటికి చలామణిలోని నగదు రూ.25,40,253 కోట్లకు చేరాల్సి ఉందన్నారు. కానీ 2016లో నోట్ల రద్దు వల్ల డిజిటలైజేషన్ పెరిగిందని గుర్తు చేశారు.
కానీ రూ.22,35,648 కోట్లు మాత్రమే చలామణిలో..
ఆన్లైన్, కార్డు చెల్లింపులు, పేమెంట్ బ్యాంక్స్ చెల్లింపుల కారణంగా రూ.3,04,605 కోట్ల విలువైన మొత్తం చలామణిలో ఉన్న నగదుకు జత కలవలేదని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరుకున్న నకిలీ నోట్ల సంఖ్యను కూడా తగ్గించినట్లు తెలిపారు. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి రూ.17,74,187 కోట్ల నగదు చలామణిలో ఉండగా, 2019 డిసెంబర్ 2వ తేదీ నాటికి చలామణిలోని నగదు రూ.22,35,648 కోట్లు అన్నారు. చలామణిలో జత కావాల్సిన నగదు 3 లక్షల కోట్లకు పైగా తగ్గిందన్నారు.
డిజిటలైజేషన్ పెరిగి, నకిలీ కరెన్సీ బెడద తప్పింది
అలాగే, 2016-17లో రూ.7,62,072 నకిలీ నోట్లు పట్టుకుంటే, 2017-18లో రూ.5,22,783 కోట్లు, 2018-19లో రూ.3,17,389 కోట్లు పట్టుకున్నట్లు తెలిపారు. ఏడాదిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 51 శాతం పెరిగినట్లు తెలిపారు. 2017-18లో రూ.2,071 కోట్లు కాగా, 2018-19లో రూ.3,134 కోట్లుగా ఉందని తెలిపారు. నోట్ల రద్దు వల్ల డిజిటలైజేషన్ పెరగడంతో పాటు నకిలీ కరెన్సీ బెడద కూడా తగ్గిందన్నారు.