అక్కడ పుచ్చుకోవడం..ఇక్కడ ఇచ్చుకోవడం: బెంగళూరు కంపెనీలో మిలియన్ల కొద్దీ పెట్టుబడులు
బెంగళూరు: దేశీయ సిలికాన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరు ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను సాగిస్తోన్న లాజిస్టిక్ స్టార్టప్ ఢిల్లీవరీ కొరియర్ అండ్ పికప్ కంపెనీ భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కొరియర్ కంపెనీ ఫెడెక్స్ ఎక్స్ప్రెస్.. భారీ పెట్టుబడులను పెట్టింది. దీని విలువ 100 మిలియన్ డాలర్లు. ఫెడెక్స్ కార్పొరేషన్ గ్రూప్ సంస్థల్లో ఒకటైన ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ నుంచి 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అందబోతున్నట్లు ఢిల్లీవరీ వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీవరీ కంపెనీలో 277 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్టిమెంట్లు వచ్చి చేరాయి.
తాజాగా లాజిస్టిక్లో నంబర్వన్గా ఉంటూ వస్తోన్న ఫెడెక్స్ కార్పొరేషన్ నుంచి ఏకంగా 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రావడం కార్పొరేట్ సెక్టార్లో స్టార్టప్ కంపెనీలకు ఉన్న డిమాండ్ను సూచిస్తోంది. కనీసం మూడు బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్టిమెంట్లను ఆకర్షించడానికి ఢిల్లీవరీ కంపెనీ ఓ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తోంది. 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడంతో పాటు భారత్లో తమకు ఉన్న కొన్ని రకాల ఆస్తులను కూడా ఢిల్లీవరీ కంపెనీకి బదలాయించాలని ఫెడెక్స్ కార్పొరేషన్ యాజమాన్యం నిర్ణయించింది.
ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను పెట్టిన తరువాత ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాన్ కొల్లెరాన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు నామినేట్ చేసినట్లు ఢిల్లీవరీ సంస్థ తెలిపింది. దేశీయ లాజిస్టిక్ సెక్టార్లో తమ కార్యకలాపాలు మరింత విస్తృతం కావడానికి ఇది సహకరిస్తుందని ఫెడెక్స్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజ్ సుబ్రమణియన్ చెప్పారు. ఫెడెక్స్ వంటి అంతర్జాతీయ కంపెనీతో కలిసి పనిచేయబోతోండటం ఎగ్జయిటింగ్గా ఉందని ఢిల్లీవరీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాహిల్ బారువా పేర్కొన్నారు. లాజిస్టిక్ సెక్టార్లో ఇదో విప్లవాత్మకమౌతుందని చెప్పారు.