కరోనా డ్రగ్: గ్లెన్మార్క్ ఫార్మాకు నోటీసులు, ఎందుకంటే
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఫార్మా దిగ్గజం గ్లెన్మార్క్కు నోటీసులు పంపించింది. యాంటీ వైరల్ ఫ్యాబిఫ్లూకు సంబంధించి పాల్స్ క్లెయిమ్స్, డ్రగ్ ధరకు సంబంధించి ఓ పార్లమెంటు సభ్యుడి నుండి ఫిర్యాదు వచ్చింది. దీంతో వివరణ కోరుతూ ఈ నోటీసులు పంపించింది. ఓ పార్లమెంటు సభ్యుడి నుండి ఫిర్యాదు వచ్చిందని ముంబైకి చెందిన ఈ కంపెనీకి పంపిన నోటీసులో DCGI డాక్టర్ వీజీ సోమానీ పేర్కొన్నారు.
గ్లెన్మార్క్ శుభవార్త, కరోనా ఫాబిఫ్లూ 27% తగ్గింపు: ఏ దేశంలో ఎంత ధర?
ఫాల్స్ క్లెయిమ్స్, ధర
అధిక రక్తపోటు, మధుమేహం కలిగిన కరోనా బాధితులకు కూడా ఈ యాంటీ వైరల్ ఫ్యాబిఫ్లూ(ఫెవిపిరవిర్) మెడిసిన్ బాగా పని చేస్తుందనే ప్రచారం తప్పు అని, బీపీ వంటివి ఉన్నవారికి ఫ్యాబిఫ్లూ ఎలా పని చేస్తుందనే అంశంపై సమగ్ర వివరాలు లేవని, ధర కూడా మధ్య తరగతి ఆదాయం కలిగిన వారికి అందనంత ఎత్తులో ఉందని, 122 పిల్స్ కలిగిన కోర్స్ మొత్తానికి రూ.12,500 అవుతోందని, ఈ ట్యాబ్లెట్స్ ధరను పేదలకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని సదరు ఎంపీ ఫిర్యాదు చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
17వ తేదీన లేఖ
ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని తయారీ సంస్థ గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ను DCGI డాక్టర్ వీజీ సోమానీ ఆదేశించారు. అన్ని అంశాల పైన వివరణ ఇవ్వాలని కంపెనీకి సూచించారు. ఈ మేరకు జూలై 17వ తేదీన నోటీసులు పంపించింది. దీనిపై గ్లెన్ మార్క్ స్పందించాల్సి ఉంది. ఇందులో 122 ట్యాబ్లెట్స్ ఉండగా మొదటి రోజు 18 ట్యాబ్లెట్స్, రెండో రోజు నుండి 14వ రోజు వరకు రోజుకు 8 ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తారు.
ఇటీవలే ధర తగ్గింపు
కాగా, ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో కరోనా చితిక్స కోసం వినియోగిస్తున్న Favipiravir ఔషధం ధరను తగ్గిస్తున్నట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ప్రకటించింది. ఒక్కో టాబ్లెట్ పైన 27 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీని ధరను తొలుత రూ.103గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇరవై ఏడు శాతం తగ్గింపు నేపథ్యంలో రూ.75కే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. కరోనా వైరస్ లక్షణాలు స్వల్ప, మోతాదుగా ఉన్నప్పుడు దీనిని వినియోగిస్తున్నారు. తాము ధరను తగ్గించినట్లు గ్లెన్ మార్క్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. భారత్లోని గ్లెన్ మార్క్ కేంద్రాల్లో అత్యుత్తమ పద్ధతుల్లో, ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్లో తక్కువకు ఔషధాలను తయారు చేస్తుండటంతో ధరను తగ్గించడానికి వెసులుబాటు లభించినట్లు తెలిపింది. ఇప్పుడు ఆ ప్రయోజనాలను బాధితులకు బదలీ చేస్తున్నట్లు వెల్లడించింది.