సైబర్ నేరాలతో రూ.1.25 లక్షల కోట్ల నష్టం, మొబైల్ ఫోన్లపై ఇలా..
గత ఏడాది (2019) సైబర్ నేరాల కారణంగా భారత్లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ భద్రత ఉత్పత్తులను కేవలం కొన్ని భారత్ కంపెనీలే ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు. సైబర్ భద్రతకు ఒక పరిశ్రమ వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు సొంతంగా సొల్యూషన్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఏమాత్రం సరిపోదు : భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక నిపుణులు ఏం చెప్పారంటే?
సైబర్ నేరాలు పెరిగే అవకాశం
దేశంలో స్మార్ట్ నగరాలు, 5G నెట్ వర్క్ వంటివి తీసుకు వస్తుండటం వంటి కారణాల వల్ల భారత్లో సైబర్ నేరాల ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజేష్ పంత్ హెచ్చరించారు. సైబర్ భద్రతా ఉత్పత్తులను కొన్ని కంపెనీలే తయారు చేస్తుండటంతో ఈ రంగంలో శూన్యత ఉందన్నారు. విశ్వసనీయమై దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్ అవసరమన్నారు.
రాన్సమ్వేర్ దాడులు పెరుగుతున్నాయి
గత సంవత్సరం సైబర్ దాడుల కారణంగా భారత దేశంలో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. రాన్సమ్వేర్ దాడులు ప్రతిరోజు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా సైబర్ క్రైమ్స్ ఇంటి వద్ద నుండి చేస్తున్నారన్నారు. వారు చివరకు ఆసుపత్రులపై కూడా దాడి చేస్తున్నారని, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి యాజమాన్యాలు చెల్లింపులకు ముందుకు వస్తారని వారికి తెలుసన్నారు.
మొబైల్ ఫోన్లపై ఇలా దాడి
మొబైల్ ఫోన్ వంటి పరికరాలకు ఎన్నో ప్రమాదాలున్నాయన్నారు. మొబైల్ ఫోన్పై దాడుల తీరును విశ్లేషించామని, కేవలం యాప్స్ పైనే కాదు పదిహేను రకాల విభిన్న మార్గాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్లు, మెమొరీ చిప్స్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, బ్లూటూత్, వైఫై వంటివి కూడా ఉన్నట్లు తెలిపారు. ఫోన్లలో ముందుగానే ఇన్ స్టాల్ అయి ఉండే యాప్స్ చాలా వరకు డేటాను తరలిస్తున్నట్లు తెలిపారు.