కరోనా ఎఫెక్ట్: అమెజాన్ అమ్మకాలు ఢమాల్! ఇండియాలో 90% తగ్గిన సేల్స్?
అమెజాన్. ఈ పేరు చెబితే తెలియని వారుండరు. అంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఈ కామర్స్ కంపెనీ ఇది. కానీ, ఇటీవలి కరోనా వైరస్ దెబ్బకు మాత్రం అతలాకుతలం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఈ కంపెనీని ప్రభావితం చేస్తున్నా... ఇండియా లో మాత్రం అది మరింత అధికంగా ఉండటం విశేషం. చైనా లో మొదలైన కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచంలోని 200 దేశాలకు విస్తరించి ఎవరికీ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మెజారిటీ దేశాలు తమ దేశాలను, ప్రజలను కాపాడుకునేందుకు లాక్ డౌన్ విధించాయి. దీంతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. అయితే, చాలా దేశాల్లో ఈ కామర్స్ కంపెనీల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వగా... ఇండియా లో మాత్రం నియంత్రణలు కొనసాగుతున్నాయి. మన దేశం కూడా నిత్యావసరాలైన కూరగాయలు, ఇతర గ్రోసరీ సరుకుల డెలివరీ వరకు అనుమతించింది. అయితే, అమెజాన్ వంటి దిగ్గజాలకు వాటి మొత్తం వ్యాపారంలో గ్రోసరీ విభాగం వాటా చాలా తక్కువ మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ విషయంలో ఇదే జరిగింది.
గుడ్న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, హైదరాబాద్ సహా ఏ నగరంలో ఎంతంటే?
10% నికే పరిమితం...
ఇండియా లో లాక్ డౌన్ విధించిన తర్వాత .... అమెజాన్ అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. తొలుత ఒక 21 రోజులే కదా అనుకుని సర్దుకున్నా... దేశంలో కరోనా పోసిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పటికే దాదాపు రెండు నెలల సమయం గడిచిపోయింది. దీంతో అమెజాన్ అమ్మకాలు 90% పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం కేవలం 10% మేరకే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ.. అమెజాన్ అమ్మకాల్లో 18% వృద్ధి నమోదై సుమారు 19.1 బిలియన్ డాలర్ల టర్నోవర్ నమోదైంది. కానీ ఇండియా లో మాత్రం పరిస్థితులు తారుమారు అయ్యాయి.
నష్టాలే...
అమెజాన్ కు ఈ కామర్స్ కంపెనీ తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ సర్వర్ నిర్వహణ ద్వారా కంపెనీ పెద్ద మొత్తంలో ఆదాయాలను ఆర్జిస్తోంది. దీంతో, కరోనా ఉన్నప్పటికీ... అమెజాన్ ఇన్క్ ఆదాయం పెరిగింది. జనవరి నుంచి మార్చి కాలానికి కంపెనీ 75.45 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయంలో 26% వృద్ధి సాధించింది. దీనిపై 2.5 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కానీ, ఈ కామర్స్ రంగం లో మాత్రం ఇప్పటికీ కంపెనీ నష్టాలను చవిచూస్తూనే ఉంది. ఈ మూడు నెలల కాలంలో అమెజాన్ కు కేవలం ఈ కామర్స్ రంగం నుంచి 19.1 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరగా... నష్టాలు నాలుగు రెట్లు పెరిగి 398 మిలియన్ డాలర్లకు చేరుకోవటం గమనార్హం.
128 నగరాల్లో సేవలు...
ప్రస్తుతం ఇంకా లాక్ డౌన్ ఈ నెల 17 వరకు కొనసాగనున్న తరుణంలో అమెజాన్ ఇండియా లో పాంట్రీ సర్వీసుల ను ప్రారంభించింది. ఈ సేవలు దేశంలోని 128 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరో 68 నగరాల్లో ఇతర సేవలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పాంట్రీ పేరుతో అమెజాన్ దేశంలో గ్రోసరీ సరుకుల డెలివరీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అమెజాన్ ఇండియా లో బిగ్ బజార్, మోర్ సూపర్ మార్కట్లలో వ్యూహాత్మక పెట్టుబడులు కూడా పెట్టింది. తనకు వచ్చిన ఆర్డర్లను సమీపంలోని బిగ్ బజార్, మోర్ సూపర్ మార్కెట్ల నుంచి వినియోగదారులకు సరుకులను డెలివరీ చేస్తుంది. అమెజాన్ నౌ అని రెండు గంటల్లోనే డెలివరీ అనే సేవలు ప్రారంభించినా ఆశించిన ప్రయోజనం లభించలేదు.