క్రిప్టో కరెన్సీతో ప్రమాదం, ఆర్థిక వ్యవస్థ డాలరైజేషన్కు అవకాశం
క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుల ముందు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇతర ఉన్నతాధికారులు క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోలతో దేశ సార్వభౌమత్వానికి ముప్పు అన్నారు.
డాలర్లలో జరిగే వీటి ట్రాన్సాక్షన్స్ భారత ఆర్థిక వ్యవస్థలో కొంత భాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకా ద్రవ్య చలామణిని దెబ్బతీయడం ద్వారా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
క్రిప్టోతో దేశ బ్యాంకింగ్ రంగానికి కూడా ముప్పు ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. క్రిప్టో ఆకర్షణలో పడి తమ కష్టార్జితాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద చాలినన్ని నిధులు ఉండవని తెలిపారు. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా, అక్రమ నగదు ట్రాన్సాక్షన్, డ్రగ్స్ అక్రమ రవాణాకు సాధనాలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.