క్రిప్టో కరెన్సీ చాలా ప్రమాదకరం, ప్రత్యేక చర్యలు అవసరం: శక్తికాంతదాస్
క్రిప్టో కరెన్సీ చాలా ప్రమాదకరమైనదని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. విలువ కలిగినవి మాత్రమే నమ్మకం కలిగిస్తాయని, అలాంటివి లేనప్పుడు ఒక పేరు కింద చలామణి అవుతాయన్నారు. పలు సంస్థలు, వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత క్రిప్టో కరెన్సీపై సంప్రదింపుల పత్రాన్ని ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ పెరుగుతోందని, సైబర్ ముప్పు అధికం అవుతున్నందున ప్రత్యేక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆర్థిక రంగానికి చేరువైతున్నప్పటికీ దాని ప్రయోజనాల్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఆర్థిక స్థిరత్వానికి అంతరాయం కలిగించే వాటిని పక్కన పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజ్ అవుతోందని, సైబర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు.
నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆర్థిక సాంకేతిక పరిశ్రమ 2020లో 50 నుండి 60 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని, 2025 నాటికి ఇది 150 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో భారత్ అత్యధికంగా ఫిన్ టెక్ (87 శాతం) స్వీకరణను కలిగి ఉంది. 2021-22లో 278 ఒప్పందాల ద్వారా 8.53 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది.