2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ సవరించింది. గతంలో 5 శాతం క్షీణించవచ్చునని తెలిపిన క్రిసిల్, 9 శాతం మేర ప్రతికూలత నమోదు కావొచ్చునని తాజాగా అంచనా వేసింది. కరోనా మహమ్మారి కేసుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉండటం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం తగినంతగా చేపట్టకపోవడం వంటి వివిధ కారణాలను చూపించింది. అంతకుముందు మే నెలలో మైనస్ 5 శాతం అంచనా వేయగా, తొలి క్వార్టర్లో 23.9 శాతం ప్రతికూలత నేపథ్యంలో సవరించింది.

1950 తర్వాత భారీ పతనం
మైనస్ 9 శాతం వృద్ధి రేటు నమోదయితే 1950 తర్వాత ఇదే దారుణ పతనం అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ద్రవ్య లభ్యత స్థితి, అంతంత మాత్రమే ఉండటంతో ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం పెద్దగా నిధులు కేటాయించలేకపోతోంది. వృద్ధి పుంజుకునే చర్యలు ఇప్పటి వరకు నామమాత్రమేనని తెలిపింది. మే నెలలో మరోసారి జీడీపీలో 1 శాతం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందనే అంచనాలతో నాడు మైనస్ 5 శాతం అంచనా వేసింది. అయితే అది జరగలేదని పేర్కొంది.

రుణ వ్యవస్థీకరణ స్కీం...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ పునర్వ్యవస్థీకరణ దెబ్బతిన్న రంగాలకు ఊతమిస్తుందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఆటో డీలర్షిప్స్, రత్నాలు, ఆభరణాలు, హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటక రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు కొంత ఊరటనిస్తుందని తెలిపింది. పలు రంగాలు కరోనా పూర్వస్థితికి రావడానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది. అయితే రుణ పునర్వ్యవస్థీకరణకు ప్రతి మూడు కంపెనీల్లో ఒకటి మాత్రమే అర్హత సాధిస్తుందని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఒక శాశ్వత మచ్చను మిగిల్చనుందని తెలిపింది.

రూ.30 లక్షల కోట్ల శాశ్వత నష్టం
ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం మరింతగా ఖర్చు చేయాల్సి ఉందని, అది జరగడం లేదని క్రిసిల్ అభిప్రాయపడింది. తగిన ద్రవ్య పరిస్థితులు లేవని తెలిపింది. అక్టోబర్ నాటికి కరోనా కేసులు పెరుగుదల ఆగిపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జీడీపీ వృద్ధి రేటు కొంత సానుకూల బాటలో ఉండే వీలుందని తెలిపింది. బారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఒక శాశ్వత మచ్చను మిగిల్చిందని పేర్కొంది. స్వల్పకాలికంగా చూస్తే జీడీపీకి 13 శాతం శాశ్వత నష్టాన్ని తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యాల్యూ రూ.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిపింది.


Click it and Unblock the Notifications