అక్కడ డిమాండ్ పెరగదు: నిర్మలమ్మ క్రెడిట్ ప్యాకేజీపై పీ చిదంబరం విసుర్లు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న మరో ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రూ.6 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లుగా ఉన్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం(ECLGS) పరిమితిని మరో రూ.1.5 లక్షల కోట్లకు పెంచుతూ రూ.4.5 లక్షల కోట్లకు పెంచారు. దీని వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (MSME)లకు ఊరట లభిస్తుంది.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పరిధిని ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల కోట్ల నుండి అదనంగా రూ.1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న MSMEs రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు.
క్రెడిట్ హామీ పథకంపై స్పందించారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీం అనేది క్రెడిట్ కాదని, ఈ క్రెడిట్ మరింత రుణ ఊబిలోకి నెట్టి వేస్తుందని పీ చిదంబరం అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యాపారాలకు ఏ బ్యాంకర్ కూడా రుణాలు ఇవ్వడని చెప్పారు. రుణ భారం లేదా నగదు అవసరమైన వ్యాపారాలు మరింత రుణాలను కోరుకోవన్నారు. వారికి క్రెడిట్ లేని మూలధనం అవసరమన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ఉద్యోగాలు పోయిన చోట లేదా వేతనాల కోత విధించిన చోట డిమాండ్ పెరగదన్నారు.