అమరావతి వల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరిగిందా? 31 నుంచి ప్రాపర్టీ షో
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాడీ క్రెడాయ్ (Credai) జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. డెవలపర్స్, రియాల్టర్స్, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్ ఇందులో పాల్గొంటాయి. హోమ్ బయ్యర్స్ తమకు సరైనదిగా భావించే ఇంటిని ఎంచుకోవడానికి, త్వరగా రుణం పొందడానికి క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో సరైన వేదిక కానుంది.
ఇల్లు కొంటున్నారా? కాస్త ఆగండి.. బడ్జెట్లో రాయితీలు?
15,000 ఇళ్ళను సేల్కు...
సుమారు 15,000 ఇళ్లని వివిధ రియల్టీ కంపెనీలు సేల్కు పెడుతున్నాయి. బ్యాంకులు, రియాల్టర్స్, ఫైనాన్షియల్ సంస్థలు దాదాపు 100 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాయి. 50 వేలకు మించి సందర్శకులు ప్రాపర్టీ షోకు వస్తారని అంచనా. ఇది మూడు రోజుల ఈవెంట్. కాగా, క్రెడాయ్కు ఇది తొమ్మిదో ప్రాపర్టీ షో. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణా రావు మాట్లాడారు.
అమ్ముడుపోని ప్లాట్లు ఎక్కువగా లేవు
భాగ్యనగరంలో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య పెద్దగా ఎక్కువగా లేదన్నారు. అమ్ముడుని కాని ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆర్థిక మాంద్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్మాణ సంస్థలు డిమాండును బట్టి కొత్త నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో అమ్ముడు కాని ఫ్లాట్లు మహా అయితే వెయ్యి వరకు ఉంటాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజకరమన్నారు. సుస్థిర ప్రోత్సాహక, విప్లవాత్మక నిర్ణయాల వల్లే పెట్టుబడిదారుల చూపు హైదరాబాదు వైపు మరలిందన్నారు.
మరో అయిదేళ్లు ఇదే దూకుడు
గత అయిదేళ్లలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధిని సాధించిందని, రానున్న నాలుగైదేళ్లలోను ఇదే పెరుగుదల ఉంటుందని, ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలో వృద్ధి, స్థిరమైన ప్రభుత్వం, ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఇందుకు దోహదం చేశాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
అమరావతి ఉద్రిక్తత వల్ల హైదరాబాద్కు డిమాండ్ పెరుగుతోందా?
గత అయిదేళ్ల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం సరికొత్త రూపు సంతరించుకుందని, రెరా రాకతో అన్ని రకాల అనుమతులు ఉండి, నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరుగుతోందన్నారు. అమరావతిలో ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ రియల్ రంగం అభివృద్ధి చెందుతుందనేది అపోహ అన్నారు. సుస్థిర పాలన, సానుకూల వాతావరణం, పెట్టుబడులను ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడి కోసం అనేక సంస్థలు ముందుకు వస్తాయన్నారు.
ఇళ్లకు డిమాండ్
అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరాన్ని కేంద్రంగా మార్చుకుంటున్నాయని, భారీ గా కో-వర్కింగ్ స్పేస్ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నిపుణుల లభ్యత, ఉద్యోగావకాశాలు పెరగడం వంటి కారణాలతో ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే నాలుగైదేళ్లలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయని, ప్రతి ఏడాది నలభై వేల వరకు కొత్త ఇళ్లను నిర్మించే వీలుందన్నారు. టీఎస్ఐపాస్ తరహాలో టీఎస్బిస్ కారణంగా త్వరగా, పారదర్శకంగా, నిర్ణీత సమయంలో అనుమతులు పొందడానికి దోహదపడుతోందన్నారు.