ఈపీఎఫ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్మలమ్మకు ఘాటు లేఖ
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన అనంతరం తమ భవిష్యత్ అవసరాల కోసం కోట్లాదిమంది ఉద్యోగులు డిపాజిట్ చేసుకునే చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు (EPF interest rate)ను మరోసారి కుదించింది. ఈ కుదింపు అలాంటిది ఇలాంటిది కాదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం- ఏకంగా 40 సంవత్సరాల కాలాన్ని గుర్తుకు తెచ్చినట్టయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వ్బ్యాంక్ గుడ్న్యూస్
40 సంవత్సరాల తరువాత..
ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం కుదించింది. 8.1 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు 8.4 శాతం. దీన్ని మరింత తగ్గించింది. 8.1 శాతానికి చేర్చింది. ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్లపై ఇంత కనిష్ఠ స్థాయిలో వడ్డీరేటును నిర్ధారించడం- 40 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది శాతం. ఇప్పుడు దాదాపు అదే స్థాయికి పడిపోయింది.
బేసిస్ పాయింట్లు తగ్గింపు..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు.. ఇవ్వాళ అస్సాంలోని గువాహటిలో భేటీ అయ్యారు. ఇది 230వ సమావేశం. ఈ సందర్భంగా డిపాజిట్లపై వడ్డీరేటును కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. ఫలితంగా- వడ్డీ రేటు 8.4 నుంచి 8.1 శాతానికి దిగజారింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా అయిదు కోట్ల మంది ఉద్యోగులపై పడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు గత సంవత్సరం మార్చిలో చివరిసారిగా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.4గా నిర్ధారించారు. ఇప్పుడు మళ్లీ దీన్ని 8.1కి కుదించారు.
ఆర్థికశాఖకు తీర్మానం..
ఈ మేరకు ట్రస్టీలు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ తీర్మానాన్ని పంపించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ర్యాటిఫై చేసిన వెంటనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అంచనా వేస్తోన్నారు.
సీపీఐ ఎంపీ లేఖ..
ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తోన్నాయి. కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కు లేఖ రాశారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించడం వల్ల ఆరు కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ నిజస్వరూపం ఇదే..
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన మరుసటి రోజే ఇన్ని కోట్ల మంది ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించడమే భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపమని విమర్శించారు. సామాజిక భద్రత కోసం కోట్లాదిమంది ఉద్యోగులు, కార్మిక వర్గం డిపాజిట్ చేసుకునే భవిష్యనిధిపై వడ్డీ రేటును తగ్గించడం- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఆర్థిక విధానాలను అద్దం పడుతోందని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు.