మా వ్యాపారానికి కరోనా ప్రభావం లేదు, కానీ అది ఇప్పుడే చెప్పలేం
తమ వ్యాపారాలపై కరోనా మహమ్మారి ప్రభావం అంతగా లేదని ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్ట్లే ఇండియా గురువారం తెలిపింది. కరోనా పర్యావసనాలు, లాక్ డౌన్ అనంతర పరిస్థితులను మదింపు చేయడం కొనసాగిస్తామని తెలిపింది. మూలధనం లేదా ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి ప్రత్యేక సవాళ్లు ఎదురు కాలేదని, లాభదాయకతపై కూడా భారీ ప్రభావం పడలేదని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
ప్యాకేజీ నుండి డాలర్ వరకు... భారీగా తగ్గి అంతలోనే పెరిగిన బంగారం ధర
సరిపడా నగదు నిల్వలు ఉన్నాయి
కంపెనీ వద్ద సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని నెస్ట్లే ఇండియా తెలిపింది. ఆర్థిక అవసరాలకు సరిపడా నగదు లభ్యతకు ఇబ్బంది లేదని వెల్లడించింది. అయితే స్వల్పకాలం లేదా వార్షిక ఫలితాలపై కరోనా ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్లాంట్స్, సరఫరా కేంద్రాలు, గోదాముల్లో కార్యకలాపాలు పునరుద్ధరించామని తెలిపింది.
కఠినమైన భద్రతా పద్ధతులు
కంపెనీకి అవసరమైన ఆర్థిక అవసరాల కోసం ద్రవ్యస్థితి మెరుగ్గా ఉందని, అలాగే, కరోనా ప్రభావం ఇప్పటి వరకు కనిపించనప్పటికీ, సమీప భవిష్యత్తు లేదా వార్షిక కాలంలో అంచనా వేయడం కష్టమని తెలిపింది. కరోనా ప్రభావాన్ని ఎప్పటికి అప్పుడు అంచనా వేస్తున్నామని తెలిపింది. తిరిగి ప్రారంభమైన ఎనిమిది ప్లాంట్స్, పంపిణీ కేంద్రాలు, గిడ్డంగుల వద్ద కఠినమైన భద్రతా పద్ధతులను అవలంభిస్తున్నట్లు తెలిపారు. సామాజిక దూరం కోసం అవసరమైన విధానాలు అనుసరిస్తున్నట్లు తెలిపారు.
మార్చి క్వార్టర్లో భారీగా లాభాలు
నెస్ట్లే ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, కస్టమర్లకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నెస్ట్లే జనవరి - డిసెంబర్ను ఆర్థిక సంవత్సరంగా లెక్కిస్తుంది. ఈ జనవరి - మార్చి క్వార్టర్లో నెస్ట్లే ఇండియా సేల్స్ 13.54 పెరిగాయి. రూ.3,305.78 కోట్ల నెట్ సేల్స్ ఉండగా, నెట్ ప్రాఫిట్ 10.84 శాతం పెరిగి రూ.525 కోట్లుగా ఉంది.