కరోనా దెబ్బ, 2030 నాటికి పేదరికంలోకి 100 కోట్లమంది
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తోన్నప్పటికీ మున్ముందు దీని ప్రభావం భారీగానే ఉండనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం మరో 20 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టి వేస్తోందని ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నవారితో కలిపి 2030 నాటికి దాదాపు 100 కోట్ల మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తారని ఆందోళన వ్యక్తం చేసింది.
వచ్చే దశాబ్ద కాలంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తాజాగా అంచనా వేసింది. ఇందుకు యూనివర్సిటీ డెన్వర్ భాగస్వామ్యంతో అధ్యయనం చేపట్టింది. కరోనా ముందు పరిస్థితుల ప్రకారం 2030 నాటికి 4 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో ఉంటారని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది. కానీ ప్రస్తుత మరణాల రేటు, ఇటీవలి అభివృద్ధి అంచనాల ప్రకారం తాజాగా అంచనా వేశారు. కరోనా పరిస్థితుల్లో అన్నీ మారిపోయాయి.
మరణాల నష్టం ఎక్కువగా ఉండి, కరోనా తీవ్రత నుండి కోలుకోవడానికి సమయం పడితే 2030 నాటికి మరో 20 కోట్లమంది తీవ్ర పేదరికంలోకి వెళ్తారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం మరో పదేళ్ల పాటు సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలు, డిజిటలీకరణ, ప్రభుత్వ పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరాన్ని తాజా నివేదిక గుర్తు చేసింది.