COVID 19 షాక్: భారత్లో 13.5 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం, W ఆకారంలో రికవరీ
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆగ్రరాజ్యం సహా దాదాపు అన్ని దేశాల పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. కరోనా -లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల భారత్లో దాదాపు 13.5 కోట్ల ఉద్యోగులకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్ అంచనా వేసింది. 12 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి జారుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.
COVID 19: రూ.660 లక్షల కోట్ల నష్టం, చైనాకు భారీ దెబ్బ: శాలరీ తగ్గుదల 1.8 లక్షల కోట్లు
భారత్ జీడీపీకి ప్రమాదకర అంశాలు
కరోనా తదనంతర పరిణామాల వల్ల ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని, ఖర్చులు, సేవింగ్స్ పైన ప్రభావం పడిందని ఈ నివేదిక తెలిపింది. ఉద్యోగ నష్టం.. అంటే ఉద్యోగాలు పోవడం, పేదరికంలోకి తిరిగి కోట్లాది మంది వెళ్ళడం, తలసరి ఆదాయం తగ్గటం వంటి అంశాలు భారత్కు హాని కలిగిస్తాయని, దీని వల్ల గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) తగ్గుతుందని తెలిపింది.
డబ్ల్యు ఆకారంలో వృద్ధి.. జీడీపీ 10.8 శాతం డౌన్
రోజు రోజుకు ఇండియాలో పెరుగుతున్ కరోనా కేసుల చూస్తోంటే రికవరీకి W ఆకారంలో వచ్చే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. దీంతో దేశ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం మేర కుంచించుకుపోతుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని అంచనా వేసింది.
వీటిపై తీవ్ర ప్రభావం
కరోనా వల్ల భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు, శక్తిమంతం చేసేందుకు పాయింట్ల కార్యక్రమం పేరుతో రూపొందించిన అంశాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచింది. అంచనా వేసిన జీడీపీ మందగమనం తాలుకు నష్టాలతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని తెలిపింది.
నిరుద్యోగిత రేటు 35 శాతం
దేశంలో నిరుద్యోగిత రేటు 7.6 శాతం నుండి 35 శాతానికి పెరగవచ్చునని నివేదిక తెలిపింది. 13.6 కోట్ల ఉద్యోగాలు పోవడమే కాకుండా 17.4 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారని తెలిపింది. 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని పేర్కొంది. ఇందులో 4 కోట్ల మందినిరుపేదలుగా మారుతారని తెలిపింది.
ఆత్మనిర్భర్ భారత్ మంచి అడుగు
ఇండియా W ఆకారంలో ఎకనమిక్ రికవరీని చూడవచ్చునని ఈ నివేదిక అంచనా వేసింది. భారత్కు 1 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక నష్టం ఉండవచ్చునని ఆర్థర్ డి లిటిల్ (ఇండియా, సౌత్ ఏషియా) ప్రతినిధి బార్నిక్ చిత్రాన్ మెయిత్రా అన్నారు. భారత్ రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని పెట్టుకుందని, ఇందుకోసం తక్షణ ఉద్దీపన, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈ దిశలో మంచి అడుగు అని పేర్కొంది.