తొలగింపు.. టెక్కీలకు కంపెనీలు షాక్: 'ఉద్యోగులకు 6 నెలల శాలరీ ఇవ్వాలి'
హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) పలువురు టెక్కీలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. ఆదివారం హైదరాబాదులో TITA రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. పని తీరు మదింపు పేరుతో ఉద్యోగాల తొలగింపు సరికాదని పేర్కొంది. ఒకవేళ ఉద్యోగులను తొలగిస్తే ఆరు నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఐటీలో ఉద్యోగాల కోత, టెక్కీల్లో ఆందోళన!
ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన...
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సహా వివిధ సాఫ్టువేర్ కంపెనీలు రానున్న కొద్ది నెలల్లో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇది టెక్కీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని టెక్కీలకు TITA కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించింది. ఈ మేరకు పలువురు నిపుణులు ఈ సమావేశంలో మాట్లాడి టెక్కీలకు ధైర్యం చెప్పారు
సాంకేతిక అంశాలపై పట్టు పెంచుకోవాలి
ఐటీ రంగంలోని ఉద్యోగులు ఆత్మవిశ్వాసం వీడవద్దని, ఉద్యోగులు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనే ధైర్యంతో ఉండాలని సూచించారు. సాంకేతిక అంశాలపై పట్టు పెంచుకోవాలన్నారు. ఆర్థిక మాంద్యానికి తోడు, ఐటీ కంపెనీలు కాస్ట్ కట్టింగ్స్ వంటి కారణాల చేత ఉద్యోగుల తొలగింపుపై ఎలా వ్యవహరించాలనే అంశంపై పలువురు నిపుణులు మాట్లాడారు. చివరలో TITA గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మాట్లాడారు. ఐటీ ఇండస్ట్రీపై ఆర్థిక మాంద్యం ప్రభావం, టెక్నాలజీ అప్ డేట్, ఆటోమేషన్ వంటి అంశాలపై మాట్లాడారు.
టెక్కీలకు నిరాశ..
సాధారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించుకోవాలనుకున్నప్పుడు ఒక నిర్దిష్ట రేటింగ్ ఇస్తాయని, పనితీరు మెరుగుదల ప్రణాళికను అమలు చేస్తాయని నిపుణులు గుర్తు చేశారు. అదే సమయంలో ఉద్యోగులకు 45 నుంచి 60 రోజుల సమయం మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబట్టారు. టెక్కీలు ఇక్కడే ఎక్కువగా నిరాశకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ఇంప్రూమెంట్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని డిమాండ్ చేసారు. అలాగే ఆ ఉద్యోగుల ఇన్సురెన్స్ను మరో ఏడాదికి పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
ఆరు నెలల జీతం చెల్లించాలి...
ఇయర్ ఎండ్ అప్రైజల్ పీరియడ్ పేరుతో, పనితీరు బాగాలేదనే కారణంతో తొలగింపు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు ఒప్పందాల కారణంగా తొలగించాల్సివస్తే ఉద్యోగులకు వివరించాలని, ఆరు నెలల జీతం చెల్లించాలని చెప్పారు. వారాంతాల్లో పనిచేయించుకోవడం సరికాదని, అంతర్గత బృందాల ద్వారా లైంగిన వేధింపులను నిరోధించాలన్నారు.
ఉద్యోగుల సంక్షేమ నిధి.. స్కిల్ డెవలప్మెంట్
ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీకి మరింత సహకారం అందించాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు. ఐటీ ఉద్యోగుల నుంచి ఆదాయం సమకూరుతున్నదని, వారి కోసం ఉద్యోగుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టి, ఇందులో టెక్కీలకు అవకాశం కల్పించి తిరిగి ఉద్యోగం పొందేలా చూడాలన్నారు.
ఉద్యోగులకు సలహాలు...
ఉద్యోగులు కూడా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి చేరుకోవాలని వక్తలు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఐవోటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ లెస్ కంప్యూటింగ్, వర్చువల్ రియాల్టీ, డ్రోన్ టెక్నాలజీ తదితర వాటిపై పట్టు సాధించాలన్నారు.