కరోనా.. ఐటీ కంపెనీలు ఇలా చేస్తున్నాయి: ఇలా చేయండి... ఆఫీస్లో టెక్కీలకు ఆదేశాలు
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్, ఐటీ.. ఇలా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ దేశాలకు చైనా నుంచి ఎక్కువ ముడి సరుకులు వెళ్తాయి. దీంతో ఈ ప్రభావం ఎక్కువే ఉంది. కరోనా ప్రభావం చైనాతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా. ఆటో వంటి రంగాలకు ముడి సరుకులు లేక ఉత్పత్తి పడిపోయింది. సాఫ్టువేర్ వంటి సేవారంగం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్
టెక్కీల్లో ఆందోళన
ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సియాటెల్లోని సౌత్లేక్ యూనియన్ కార్యాలయంలోని తమ కంపెనీ ఉద్యోగి ఒకరికి కరోనా సోకినట్లు తెలిపింది. అతడితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది. వారందరినీ ప్రత్యేక పరిశీలనలో ఉంచింది. చైనా, ఇరాన్, అమెరికా, భారత్.. ఇలా అన్ని దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. అమెరికాలో కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందలాది మందికి సోకింది. దీంతో టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తమైన ఇండియన్ ఐటీ కంపెనీలు
భారత్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో సాఫ్టువేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఒకరికి, హైదరాబాదులో ఒకరికి, నిన్న జైపూర్లో ఓ ఇటాలియన్ ఫ్యామిలీకి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా మరికొంతమందికి ఈ వైరస్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో భారత ఐటీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్.. పరిశుభ్రం
ఐటీ కంపెనీలు పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఇస్తున్నాయి. తమ ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కార్యాలయంలో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాయి. ఆఫీస్లకు వచ్చే ఉద్యోగులను, ఇతరులను స్క్రీనింగ్ చేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. బెంగళూరులో ఇంటెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. అలాగే, పాజిటివ్ కరోనా తేలిన హైదరాబాద్ వ్యక్తి పని చేస్తున్న కంపెనీ కూడా పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.
ప్రపంచమంతా అదే దారి!
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. దక్షిణ కొరియా, హాంగ్కాంగ్, జపాన్ తదితర దేశాల్లో దీనిని తప్పనిసరి చేసింది. చైనాలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. జపాన్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని చెప్పారు. హాంగ్కాంగ్లో నెల రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.
ఐటీ కంపెనీల సూచనలు.. వైద్యుల జాగ్రత్తలు
- ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ఉద్యోగులకు చేరవేస్తున్నాయి.
- కరచాలనం చేయకపోవడం మంచిదని, చేతులు జోడించి నమస్కరించడం ద్వారా పలకరించుకోవడం మంచిదని చెబుతున్నారు.
- కళ్లు, ముక్కు నులుముకోవద్దు.
- కరోనా వైరస్ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు ఇతరులు ఉపయోగిస్తే సోకే అవకాశముంది.
- వైరస్ చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. కానీ చేతులతో కళ్లు, ముక్కును నులుముకుంటే అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ కళ్లు, ముక్కు ద్వారా ప్రధానంగా లోపలకు వెళ్తుంది.
- ముక్కుకు మాస్క్ అత్యవసరం.
అసలు కరోనాకు మనిషిని చంపేశక్తి లేదు.. కానీ
- వాస్తవానికి కరోనా వైరస్కు మనిషిని చంపే శక్తి లేదు. కానీ అప్పటికే వారికి ఉన్న ఇతర సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి.
- పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుంటే మరణం సంభవించే అవకాశాలు తక్కువ.
- వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంటుందా అంటే ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ బతికేది ఐదు రోజులు. కానీ అక్కడి నుండి షిప్మెంట్ ద్వారా వచ్చే వస్తువులకు 20 రోజులు సమయం పడుతుంది.
ఇలా చేయడం మంచిది..
- ఈ వైరస్ నివారణకు టీకాల అభివృద్ధిపై కసరత్తు జరుగుతోంది.
- సబ్బులు, అల్కాహాల్స్తో కూడిన శానిటైజర్ వాడితే ఈ వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చు.
- కనీసం నీళ్లతో గంటకు ఓసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
- వైరస్ సోకిన తిండి తిన్నా ఏమీ కాదు. కడుపులోని యాసిడ్స్ దానిని చంపేస్తాయి. నోటి ద్వారా కంటే కళ్లు, ముక్కు నులుముకోవడం ద్వారానే ప్రమాదం ఎక్కువ.
- చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు.
14 రోజుల్లో బయటపడుతుంది
- కరోనా వైరస్ సోకితే 14 రోజుల్లో బయటపడుతుంది. లేదంటే లేనట్లే.
- కరోనా వైరస్ వ్యాప్తి చెందాలంటే ఏదైనా వాహకం ఉండాలి. లేదంటే బతకదు. ఒక వస్తువుకు కరోనా వైరస్ ఉంటే దానిని ఎవరూ తాకకుంటే 3 నుండి 5 రోజుల్లో చనిపోతుంది.
- చికెన్, మటన్ అధిక ఉష్ణోగ్రతల్లో వండుతారు. కాబట్టి వీటి నుండి కరోనా రాదు.