కరోనా వైరస్: రూ 1,70,000 కోట్ల ప్యాకేజీ.. కండిషన్స్ అప్లై!
మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగలాడిస్తోంది. ఆలస్యంగా భారత్లోకి ఎంటరైన ప్రాణాంతక వైరస్ ధాటికి ఇక్కడ కూడా 600 మందికి పైగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 20 మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఎట్టిపరిస్థితిలోనూ ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. దేశం మొత్తం కర్ఫ్యూ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో జన జీవనం స్థంభించిపోతోంది.
నాలుగు రోజుల్లో రూ.4,000 పెరిగిన బంగారం ధర, నేడు స్వల్ప ఊరట
ప్రజా రవాణా పూర్తిగా రద్దయిపోయింది. అత్యవసర సేవలు మినహా ఇంకేమి నడవటం లేదు. ఇలాంటి సందర్భంలో కలిగిన వారి పరిస్థితి ఫరవాలేదు కానీ... లేని వారికే పెద్ద కష్టమొచ్చి పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక భారీ ప్రకటన చేశారు. రూ 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో దేశంలో 80 కోట్ల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కానీ, దీనిని నిశితంగా పరిశీలిస్తే చాలా నిబంధనలు నిజమైన ప్రయోజనాలను తగ్గించేవిగా ఉండటం గమనార్హం.
రైతులకు రూ 2,000....
ప్రస్తుత ప్యాకేజీ లో భాగంగా రైతులకు ఒక్కొక్కరికి రూ 2,000 చొప్పున అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో దేశంలో సుమారు 9 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అందరూ వాహ్వా అనుకున్నారు. కానీ, మీడియాలో వచ్చిన వివర్ణాత్మక కథనాలను పరిశీలిస్తే మాత్రం కొత్త సీసాలో పాత సారా నింపిన చందంలా కనిపించింది. ఎందుకంటే, ప్రభుత్వం ఇస్తామంటున్న రూ 2,000 కొత్త గా ఇస్తున్నవి కావని రైతులు గమనించాలి. ఈ మొత్తం కేవలం పీఎం కిసాన్ యోజన కింద ఒక్కో రైతుకు సంవత్సరానికి రూ 6,000 ఇచ్చే పథకానికి సంబంధించినవే కావటం గమనార్హం. ఈ రూ 6,000 లో మొదటి విడతగా రూ 2,000 ను ఏప్రిల్ లో విడుదల చేయబోతోంది ప్రభుత్వం.
పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా..
ఇందులో భాగంగా 3 నెలల పాటు ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్మును అటు ఉద్యోగుల తరఫున 12%, ఇటు కంపెనీల తరఫున మరో 12% మొత్తం 24% వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీంతో 80 లక్షల మంది ఉద్యోగులకు, 4 లక్షల కంపెనీలకు మేలు జరుగుతుందని చెప్పారు. కానీ, దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారు. అదేమంటే.. కేవలం 100 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు, అది కూడా 90% ఉద్యోగుల వేతనాలు రూ 15,000 లోపు ఉంటేనే వర్తిస్తుంది. వాస్తవానికి ఒక కంపెనీలో 20 మందికి పైగా ఉద్యోగులు ఉంటేనే పీఎఫ్ వర్తిస్తుంది. ఈ రోజుల్లో 20 నుంచి 100 మంది ఉద్యోగులున్న కంపెనీల్లో కనీసం 30% నుంచి 40% మంది ఉద్యోగుల వేతనాలు రూ 30,000 స్థాయిలో ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. 90% మంది 15,000 లోపు వేతనాలతో పనిచేస్తున్న కంపెనీలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చని అంటున్నారు. అంటే, ఇక్కడ కూడా ప్రభుత్వం నిజానికి అందించే ప్రయోజనం ఎంతో మీరే ఊహించుకోండి.
3 నెలల ఈఎంఐ ...
ఈ రోజే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన నిర్ణయంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గమనించండి. ఆర్బీఐ నిర్ణయం అందరికీ కొంత ఊరట కల్పించేదే అయినప్పటికీ... వాయిదాలు చెల్లించకపోతే నష్టపోయేది మనమే అని గుర్తించాలి. ఎందుకంటే... 3 నెలల మారటోరియం అంటే... ఆ మేరకు రుణాల రద్దు అని అర్థం కాదు. ఇది కేవలం వాయిదా మాత్రమే. మూడు నెలల పాటు మీరు రుణ వాయిదాలు చెల్లించకపోతే ఆ కాలానికి మీరు చెల్లించాల్సిన వడ్డీ పై మరింత వడ్డీ ని మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు మీరు తిరిగి ఋణం చెల్లిస్తున్న సమయంలో అదనపు వడ్డీ భారాన్ని బ్యాంకు మీపై మోపుతోంది. దీనిని బహిరంగంగా అటు ఆర్బీఐ కానీ... ఇటు బ్యాంకులు కానీ వెల్లడించవు. కాబట్టి మీకు మీరుగా కొన్ని విషయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోండి. లేదంటే నిపుణులను సంప్రదించి (ఫోన్లో) తగిన నిర్ణయం తీసుకోండి.