ఆటో సేల్స్ పెరుగుతున్నాయి.. కానీ ఎగుమతులు మాత్రం డల్
కరోనా మహమ్మారి లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత డొమెస్టిక్ ఆటో సేల్స్ క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే ఎగుమతుల విషయానికి వచ్చేసరికి ఆ మేరకు పుంజుకోవడంలేదు. గత రెండు మూడు నెలలుగా ప్రముఖ ఆటో కంపెనీల సేల్స్ వృద్ధి దాదాపు రెండింతలుగా ఉంది. కానీ ఎగుమతులు మాత్రం క్షీణిస్తుండటం గమనార్హం.
2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 17.02 శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియ్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) ప్రకారం 7,26,232 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఆటో ఎగుమతులు ఏకంగా 41.96 శాతం పడిపోయి 1,11,555 యూనిట్లకు పరిమితమయ్యాయి.
గత రెండు త్రైమాసికాలను పరిగణలోకి తీసుకుంటే ఎగుమతులు ఏకంగా 57.52 శాతం క్షీణించి, 1,55,156 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో (ఏప్రిల్-సెప్టెంబర్)లో 3,65,247 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. భారత అతిపెద్ద ఎగుమతిదారు హ్యుండాయ్ ఇండియా ఎగుమతులు 43.53 శాతం క్షీణించి 32,041 యూనిట్లకు పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ ఎగుమతులు 40.02 శాతం దిగజారి 31,549 యూనిట్లకు తగ్గింది. జనరల్ మోటార్స్ 2017 నుండి భారత్ నుండి ఎగుమతులు చేస్తోంది. నాటి నుండి మొదటిసారి 11.95 శాతం పడిపోయి 16,630 యూనిట్లకు పరిమితమయ్యాయి.