భారత పర్యాటక రంగం, గ్లోబల్ ఎకనమీపై కరోనా ప్రభావం: RBI
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ఈ వైరస్ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై, పర్యాటక రంగంపై పడే అవకాశముందని అభిప్రాయపడింది. గురువారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వడ్డీరేట్లు యథాతథం, ఆర్థిక మందగమనానికి అనేక మార్గాలు: RBI
పర్యాటకుల సంఖ్య తగ్గింది
కరోనా వైరస్ వల్ల భారత్కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోందని దాస్ చెప్పారు. ఈ ప్రభావం పర్యాటక రంగంపై పడుతుందన్నారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సత్వర ప్రణాళిక అవసరమని చెప్పారు. ప్రయివేటు వినియోగం, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం, బడ్జెట్ కేటాయింపులు ఈ ఏడాది జీడీపీ పెరిగేందుకు దోహతపడతాయన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై
గ్లోబల్ ఆర్థికవ్యవస్థపై కూడా కరోనా ప్రభావం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా అనిశ్చితి నెలకొందని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.
బంగారం, క్రూడాయిల్ ధరలు తగ్గాయి..
అమెరికా - ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జనవరి మొదటి వారంలో క్రూడాయిల్, బంగారం ధరలు పెరిగాయని శక్తికాంత దాస్ అన్నారు. జనవరి మధ్యలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి ధరలు తగ్గినట్లు చెప్పారు.
కరోనా భయం
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు కోలుకున్నాయి. కానీ ప్రారంభంలో కరోనా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాలో 563 మంది వరకు మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా దీని బారిన 28,000 మంది పడినట్లుగా తెలుస్తోంది. కేరళలో కూడా ముగ్గురికి కరోనా సోకినట్లుగా తేలింది. మరో 2000 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు.