ఆటోకు కరోనా షాక్: మారుతీ, మహీంద్రా.. వాహనాల ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీలు
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత అతిపెద్ద ఆటో మేకర్ మారుతీ సుజుకీ తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అదే దారిలో మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెజ్ బెంజ్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, హ్యుండాయ్ మోటార్, ఫియట్, హీరో, ఫియట్ కంపెనీలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. కరోనా ప్రభావం ఆటో రంగంపై కూడా తీవ్రంగానే ఉంది.
శానిటైజర్, మాస్కుల ధర భారీగా పెంపు, రంగంలోకి దిగిన కేంద్రం
ఆటో ఉత్పత్తికి బ్రేక్
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 14వేల పైకి చేరుకుంది. మూడున్నర లక్షల మందికి వ్యాప్తించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్లాంట్లలో వెంటిలెటర్లు తయారు చేస్తామని ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఆనంద్ మహీంద్రా తన వేతనాన్ని కరోనా ఫండ్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నుండి తమ ఉత్పత్తికి విరామం ఇస్తున్నట్లు ఆటో కంపెనీలు ప్రకటించాయి.
మారుతీ సుజుకీ క్లోజ్
మారుతీ సుజుకీ ఇండియా (MSI) గురుగ్రామ్, మానెసర్లోని తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. రెండు ప్లాంట్లలో ప్రతి ఏడాది 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తి అవుతాయి. అలాగే, రోహతక్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. షట్ డౌన్ ఎన్నాళ్లు ఉంటుందనేది కరోనా వ్యాప్తి, ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
హోండా కార్ప్ కూడా
హోండా కార్స్ మార్చి 31వ తేదీ వరకు తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని సంస్థ ప్రెసిడెంట్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 31దాకా గ్రేటర్ నోయిడా, తపుకర ప్లాంట్లలో ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
హీరో మోటో కార్ప్ అదే దారిలో..
ఈ నెల చివర వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అన్ని ఉత్పాదక కేంద్రాల్లో వాహనాల తయారీని నిలిపి వేస్తున్నామని ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రకటించింది. కొలంబియా, బంగ్లా ప్లాంట్లతో పాటు నీఘ్రాలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను కూడా క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. కొంతమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.
ఉత్పత్తి నిలిపేసిన మహీంద్రా అండ్ మహీంద్రా
నాగపూర్ ప్లాంట్ను తక్షణమే మూసివేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. పుణె, ముంబై ప్లాంట్లను సోమవారం రాత్రి నుంచి నిలిపివేశామని తెలిపింది. పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని, కరోనా తీవ్రత దృష్ట్యా ప్లాంట్లలో ఉత్పత్తిని ఆపేశామని తెలిపింది. దీని ప్రభావం ఇలాగే ఉంటే దేశంలోని ఇతర ప్లాంట్లలోను ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించింది.
సహకారానికి ముందుకొచ్చిన మహీంద్రా
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున తాత్కాలిక ఆసుపత్రులు అవసరమని, ఇందుకు ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆనంద్ మహీంద్రా చెప్పారు. తమ మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్స్ను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి సేవలు కరోనా బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధమని తెలిపారు. వెంటిలెటర్ల కొరత నేపథ్యంలో తమ ప్లాంట్లలో వాటిని తయారీపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందన్నారు. తన వేతనాన్ని కరోనా ఫండ్కు ఇస్తున్నట్లు తెలిపారు.