యస్ బ్యాంకు నుండి విత్డ్రా వద్దు: కస్టమర్లకు ఆర్బీఐ గవర్నర్, కరోనాపై...
ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాము ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించామని చెప్పారు. ఒకటి యస్ బ్యాంకు రెండు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. శక్తికాంతదాస్ యస్ బ్యాంకు గురించి మాట్లాడుతూ.. మార్చి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఎత్తివేస్తామని తెలిపారు. మార్చి 26వ తేదీన కొత్త బోర్డు బాధ్యతలు తీసుకుంటుందన్నారు. అవసరమైతే యస్ బ్యాంకుకు మద్దతిస్తామన్నారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఆందోళనతో మనీ విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. యస్ బ్యాంకును తిరిగి పట్టాలెక్కిస్తామన్నారు.
కరోనావైరస్ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ... ఈ మహమ్మారికి ప్రస్తుతం మందులేదని, ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయని, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. కరోనా వాణిజ్యంపై భారీ ప్రభావం చూపుతోందన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్నారు. వృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. కరోనా కారణంగా పర్యాటకరంగం, విమానయాన సంస్థలు, హాస్పిటాలిటీ రంగం, డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ట్రాన్సుపోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపిందని శక్తికాంతదాస్ అన్నారు.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 2,000 పాయింట్లు
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే అమెరికా ఫెడ్ వడ్డీ రేటును భారీగా తగ్గించింది. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. ప్రపంచంలోని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అదే దారిలో నడిచాయి. ఈ నేపథ్యంలో భారత కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు తగ్గించి ఉపశమనం కలిగిస్తుందని ఉదయం నుండి వార్తలు వచ్చాయి. కరోనాతో పాటు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కూడా వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని చెబుతున్నారు.
కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) భేటీ అయి నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది లేకుండానే ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వడ్డీ రేట్లు తగ్గించాలని నిర్ణయించుకుంది. అమెరికా వడ్డీ రేట్లు జీరోకు వచ్చాయి.