ఐటీకి సవాల్, 2008 మందగమన పరిస్థితులు, ఏం చేయలేవ్: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం వణికిపోతోంది. మార్కెట్లు కుప్పకూలాయి. ఉత్పత్తులు నిలిచిపోయాయి. చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కరోనా ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది. ఆటో పరిశ్రమ, ఐటీ రంగం, ఎఫ్ఎంసీజీ.. ఇలా వివిధ రంగాలపై ఉంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని, ఇది భారత ఐటీ కంపెనీలకు శరాఘాతమేనని ఇన్ఫోసిస్ మాజీ సీఈవో వీ బాలకృష్ణన్ అన్నారు.
కరోనా వైరస్ దెబ్బ, ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం
ఐటీ రంగంపై కరోనా ప్రభావం
ప్రస్తుత క్వార్టర్తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోను కరోనా వైరస్ ప్రభావం భారత ఐటీ కంపెనీలపై ఉంటుందని వీ బాలకృష్ణన్ అన్నారు. మన ఐటీపై ప్రభావం పడుతుందనేందుకు వివిధ కారణాలు ఉన్నాయన్నారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, భారత ఐటీ కంపెనీల ఆన్-సైట్ సేవలపై ప్రభావం ఉంటుందన్నారు.
తమ ఐటీ వ్యయాలు తగ్గించుకోవచ్చు
ఎయిర్ లైన్స్, రిటైల్, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా కరోనా కారణంగా దెబ్బతిన్నాయని గుర్తు చేస్తున్నారు. ఐటీ సంస్థల క్లయింట్లపై ప్రభావం ఉంటుందని, ఆ వ్యాపారాలు దెబ్బతింటే క్లయింట్లు తమ ఐటీ వ్యయాలను తగ్గించుకోవచ్చునన్నారు.
వచ్చే ఏడాది వృద్ధి తగ్గుదల
కంపెనీలు తమ ఐటీ వ్యయాలు తగ్గించుకుంటే 2020-21 సంవత్సరానికి ఐటీ రంగ వృద్ధి తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్ లైన్స్, రిటైల్, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల క్లయింట్లపై కరోనా ప్రభావం భారీగానే ఉందన్నారు. ఈ ప్రభావం ఐటీపై కూడా ఉంటుందన్నారు.
వ్యయ నియంత్రణ
వాస్తవానికి కరోనా ప్రభావం ఈ క్వార్టర్లో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది మొత్తం ఈ ప్రభావం ఐటీ సేవలపై ఉండవచ్చునని చెప్పారు. ఎందుకంటే ఐటీ కంపెనీలపై ఆధారపడే క్లయింట్ల్ వచ్చే ఏడాది వ్యయ నియంత్రణకు పూనుకోవచ్చునని, ఈ ప్రభావం ఐటీ సేవల సంస్థలపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తుందన్నారు.
వీరే ప్రధాన క్లయింట్లు
విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మన ఐటీ కంపెనీల ఆన్-సైట్ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుందని చెప్పారు. అయితే రిమోట్ సేవల ద్వారా ఈ ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చునని చెప్పారు. ఆర్థిక సేవలు, ఎయిర్ లైన్స్, రిటైల్, ఆయిల్, గ్యాస్ కంపెనీలే మన ఐటీ ఇండస్ట్రీకి ప్రధాన క్లయింట్స్ అని గుర్తు చేశారు.
2008నాటి పరిస్థితులు..
2008లో ఆర్థికమాంద్యం నాటి పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కావొచ్చునని బాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. కారణం మాత్రమే వేరు అని, కానీ మాంద్యం ఉండవచ్చునన్నారు. వైరస్ ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందనేది చెప్పలేమన్నారు.
ఆ దేశాలు ఇప్పటికే మందగమనంలో..
ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, ఆర్థిక వృద్ధి మందగించిందని, అవి మందగమనంలోకి వెళ్ళాయని, ఇది ఇండస్ట్రీస్ క్లయింట్ల ఐటీ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుందని బాలకృష్ణన్ అన్నారు.
కేంద్రబ్యాంకులు ఏం చేయలేని పరిస్థితుల్లో..
ప్రస్తుతం కేంద్ర బ్యాంకులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వడ్డీ రేటు జీరోగా ఉందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2008 పునరావృతం కావొచ్చునన్నారు.